సిద్దిపేట: మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్పామ్ అని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదని, ఖర్చు కూడా తక్కువ అని, ఆదాయం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పారు. అదనపు ఆదాయం కోసం అంతరపంటలు కూడా వేయవచ్చునని తెలిపారు. ఆయిల్పామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట మండలం బంజరుపల్లికి చెందిన పిట్ల శంకర్ అనే రైతు పొలంలో మంత్రి హరీవ్ రావు ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాళేశ్వరం ఫలితంగా ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు అధిక మేలు జరుగుతున్నదన్నారు. ఈ మొక్కలు నాటడంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా 6300 ఎకరాల్లో ఈ మొక్కలు నాటామని, మొత్తం 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా వచ్చే రెండు మూడు నెలల్లో మరో 4 వేలు ఎకరాల్లో ప్లాంటేషన్ చేయనున్నామని తెలిపారు. ఆయిల్ పామ్ తోటల పెంపకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, నెలలో రెండుసార్లు క్రాప్ వస్తుందని, ప్రతి నెల రూ.30 వేల చొప్పున ఏడాదికి రూ.3 లక్షల 60 వేలు ఆదాయం ఆర్జించొచ్చని పేర్కొన్నారు.
ఏడాదిలో 24 సార్లు పంట చేతికొస్తుందని, దీనిని మంచి భవిష్యత్తు ఉన్న పంటగా చెప్పుకోవచ్చన్నారు.
రూ.లక్ష కోట్ల విలువైన ఆయిల్పామ్ను మన దేశం దిగుమతి చేసుకుంటున్నదని వెల్లడించారు. నెలకు రూ.30 వేలు డబ్బు వచ్చే పంటగా అధిక దిగుబడి, అధిక ఆదాయం కలిగిన ఆయిల్ పామ్ సాగు రైతులకు ఎంతగానో శ్రేయస్కరమన్నారు.