ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే అందరికీ హెల్త్ ప్రొఫైల్ కార్డులు మంజూరుచేస్తామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ములుగు, సిరిసిల్ల హెల్త్ ప్రొఫైల్పై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, ములుగులో 202 టీఎంల బ్లండ్ శాంపిల్స్ సేకరించామని, 1,81,540 మందికి ఆరోగ్య పరీక్షలు చేశామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 244 టీఎంలు హెల్త్ ఫ్రొఫైల్ కోసం బ్లడ్ శాంపిల్స్ సేకరించామని, 3,38,761 మందికి ఆరోగ్య పరీక్షలు చేశామన్నారు.
రాజన్న సిరిసిల్లలో 4,48,771 శాంపిళ్లు సేకరించి, 10,60,201 టెస్ట్లు నిర్వహించినట్లు మంత్రి హరీశ్రావు చెప్పారు. ములుగులో 2,69,491 శాంపిళ్లు సేకరించి, 5,08,123 టెస్ట్ లు చేశామని వివరించారు. 70 రోజుల్లో ములుగు, సిరిసిల్లలో హెల్త్ ఫ్రొఫైల్ సేకరణ చేశామన్నారు. ఒక ఏఎన్ఎం, ఒక ఆశాతో టీం ఏర్పాటు చేసి, ఇంటి వద్దనే రక్త నమూనాలు స్వీకరించినట్లు చెప్పారు. ములుగు, ఏటూరు నాగారంలో తాత్కాలికంగా ల్యాబ్ ఏర్పాటు చేసి శాంపిల్స్ను ఎనాలిసిస్ చేస్తున్నట్లు వివరించారు. ఇతర ప్రాంతాల్లో ఇంటి వద్దకు వెళ్లి బ్లడ్ శాంపిల్ సేకరిస్తున్నారని, అనంతరం పీహెచ్సీకి తరలించి, అక్కడి నుంచి టీ హబ్ కు తీసుకువెళ్లి ఎనాలిసిస్ చేస్తున్నట్లు తెలిపారు.
ఎత్తు, బరువు, బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, కాటరాక్ట్ చెక్, ఆక్సిజన్ పల్స్ రేట్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షనింగ్, సీబీపీ, థైరాయిడ్లాంటి 30 ఆరోగ్య సూచికకు ( పారామీటర్ల) ఆ వివరాలు సేకరించి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్లో క్రోడీకరిస్తారని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ తయారుచేసేటప్పుడు ఒక వ్యక్తి గతంలో ఎలాంటి వ్యాధులు లేవంటే ఒక సారి మాత్రమే రక్త నమూనాలు సేకరిస్తారని, ఆ శాంపిళ్ల నుంచి ఎనిమిది హెల్త్ పారామీటర్ల సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు. గతంలో వ్యాధులున్నాయని చెబితే రెండు సార్లు రక్త నమూనాలు తీసుకుని అందులోనుంచి 30 పారామీటర్లలో శాంపిల్ ఎనాలిసిస్ చేస్తారని వివరించారు. ఆ వివరాలు ఆ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్లో క్రోడీకరిస్తారని మంత్రి హరీశ్రావు తెలిపారు.
ఈ ప్రక్రియలో వ్యక్తి పేరు, ఆధార్, మెబైల్ నెంబర్, ఫొటో తీసుకుని భద్రపరుస్తారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వీటితోపాటు ఆ వ్యక్తి ఆరోగ్య సమాచారమంతా డేటా కేంద్రంలో నిక్ష్లిప్తమవుతుందని పేర్కొన్నారు. బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత ఎస్ఎంఎస్ రూపంలో హెల్త్ ప్రొఫైల్ డీటెయిల్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్ ఇచ్చిన వ్యక్తికి సమాచారం అందుతుందని తెలిపారు. బ్లడ్ ఎనాలిసిస్ పూర్తయిన తర్వాత మొబైల్ యాప్ నుంచి సమాచారం డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా సదరు వ్యక్తి ఫోన్ కు ఎస్ఎంఎస్ ద్వారా సమచారం వస్తుందని, అప్పుడు తన ఆరోగ్య సమాచారం మొబైల్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.
మిగిలిపోయినవారి శాంపిళ్లు సేకరించాలి..
ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారుంటే గుర్తించి, వారి బ్లడ్ శాంపిల్ సేకరించి సమాచారం క్రోడీకరించాలని అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. టీ డయాగ్నోసిస్లో బ్లడ్ శాంపిల్స్ ఎనాలిసిస్ త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. 24 గంటల్లో సమాచారం వ్యక్తులకు అందుతుందా? లేదా? అన్నది ఫ్యామిలీ అండ్ హెల్త్ కమిషనర్ పరిశీలించాలన్నారు. మెసేజ్ పంపే ఆ సమయాన్ని 24 గంటల కన్నా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్లడ్ శాంపిళ్లను ఎనాలిసిస్ చేసిన తర్వాత ఆరోగ్యం బాగా లేని వారిని గుర్తించి, వారు డాక్టర్ను సంప్రదించాలని వారి ఫోన్లకే మెసేజ్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హెల్త్ ప్రొఫైల్ పూర్తయ్యాక ప్రతీ వ్యక్తికి కార్డు ఇస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆ కార్డు ద్వారానే ఆరోగ్య సమాచారం, తదుపరి చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆధార్లో ఫింగర్ ప్రింట్స్, పూర్తి సమాచారం ఉందని, ఆ సమాచారంతో హెల్త్ ప్రొఫైల్ కార్డును రూపొందించేలా చర్య తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో తెలంగాణ హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్రావు, కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, టీఎస్ టీఎస్ ఎండీ వెంకటేశ్వర్లు, సిరిసిల్ల, ములుగు డీఎం అండ్ హెచ్వోలు పాల్గొన్నారు.