ఖమ్మం: ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్ సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్కు ఈ సభ చాలా ముఖ్యమని చెప్పారు. ఇది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని వెల్లడించారు. ఈ సభకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వంటి జాతీయ స్థాయి నాయకులు వస్తున్నారని తెలిపారు. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఇంతకుముందెన్నడు ఇలాంటి సభ జరుగలేదని చెప్పారు. పాలేరు నుంచి 50 వేల మందకి తగ్గకుండా రావాలన్నారు. ఖమ్మం సభను విజయవంతం చేసినతర్వతే తమకు నిజమైన పండుగ అని తెలిపారు.
దేశంలో తెలంగాణ నమూనాపై చర్చ జరుగుతున్నదని చెప్పారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదని ఎద్దేవా చేశారు. మన రైతుబంధును కాపీ కొట్టిన కేంద్రం.. రైతులకు రూ.2 వేలు ఇస్తుందని చెప్పారు. నల్లచట్టాలను తెచ్చి 750 మంది రైతులను బీజేపీ పొట్టన పెట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదుకానీ.. పెట్టుబడి మాత్రం రెండింతలయ్యిందని విమర్శించారు.
పాలేరు నియోజకవర్గంలో రెండు నదుల నీళ్లు పారుతున్నాయని చెప్పారు. ఇలా కృష్ణా, గోదావరి నదుల నీళ్లు పారే ఏకైక నియోజకవర్గం పాలేరేనని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి ఒక్క చుక్క నీరుకూడా రాలేదని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో 9 నెలల్లోనే భక్తరామదాసు పూర్తి చేసుకున్నామన్నారు. ఈ ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని చెప్పారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు కూడా ఇక్కడికి వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. రైతులు ఉచిత విద్యుత్ అడిగితే పిట్టలను కాల్చినట్లు కాల్చిన నరరూప రాక్షసుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేశారని వెల్లడించారు. పెట్టుబడి సాయం కింద రైతుల అకౌంట్లలో రూ.65 వేల కోట్లు జమచేశామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 95 వేల రైతు కుటుంబాలకు రైతుబీమా అందించామని, నీటి తిరువా రద్దుచేసి కాలువల ద్వారా నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. పాపాలు చేసిన పార్టీలకు దేశంలో స్థానం లేదన్నారు.