Harish Rao | మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా.. పచ్చని పంటలతో కళకళలాడుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. కరువును తరిమికొట్టి.. వలసలను వాపస్ తీసుకొచ్చిన కేసీఆర్ వెంటే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14కు 14 స్థానాల్లో ఎగిరేది గులాబీ జెండానే అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
జడ్చర్ల మండల కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
2018లో లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారని, కరోనా వల్ల కొంత ఆలస్యమైందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు సకల సౌకర్యాలతో ఈ ఆస్పత్రిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి అబద్దాలు చెప్పడం అలవాటై పోయిందన్నారు. మహబూబ్నగర్కు మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత లక్ష్మారెడ్డిదే అని పేర్కొన్నారు. ఇప్పటికే మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు.
గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. కరువు లేదు. వలసలు ఆగిపోయాయి. ఆకలి చావులు లేవు అని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషితో పాలమూరు పచ్చని పైరుతో కళకళలాడుతోందన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రకృతి వైపరీత్యంతో సమానం అని విమర్శించారు. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం.. ఇష్టపడి అభివృద్ధి చేసుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొనకుంటే.. ఈ రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో కలిసి రాలేదు.. ఇప్పుడు అభివృద్ధిలో కూడా కలిసి రావడం లేదని ధ్వజమెత్తారు.