హైదరాబాద్: శారీరక శ్రమ లేకపోవడం వల్లే బీపీ, షుగర్లు వస్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆరోగ్య తెలంగాణ అంటే రోగాలు రాకుండా చూడాలని సూచించారు. ప్రజలు వ్యాధుల బారినపడకుండా చూడాలని సీఎం కేసీఆర్ చెబుతున్నారని వెల్లడించారు. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం వల్ల అవగాహన కల్పించాలని చెప్పారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబాలకు సన్మానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్య, మహిళా సంక్షేమం, ఆయుష్ విభాగాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా రోగాలను నియంత్రించగలిగామన్నారు.
ఒకరి అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ కలుగుతుందన్నారు. గతంలో డబ్బున్నవాళ్లే అవయవ మార్పిడి చేయించుకోగలిగేవారని చెప్పారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పేదలకు కూడా అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కు ఆరోగ్యశ్రీలో రూ.10 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే గాంధీ దవాఖానలో అవయవ మార్పిడి బ్లాక్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఆరు నెలల్లో రూ.35 కోట్ల విలువైన పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. అవయవ మార్పిడిలో ప్రైవేటు దవాఖానలతో పోటీపడేలా వసతులు కల్పిస్తామన్నారు.
అవయవ దానం చేసేవారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం 3 వేల మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయినవారి అవయవాలు తరలించడానికి హెలికాప్టర్ కూడా వినియోగిద్దామన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. తెలంగాణ ఏం చేస్తే ఇప్పుడు దేశమంతా అదే చేస్తున్నదని వెల్లడించారు.
Speaking at 12th Organ Donor Felicitation at Gandhi Medical College #OrganDonationDay https://t.co/nwnh7npP3q
— Harish Rao Thanneeru (@trsharish) November 27, 2022