హైదరాబాద్: ప్రభుత్వ వైద్యం పటిష్టతకే కొత్త మెడికల్ కాలేజీలు (Medical colleges) ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. పెరిగిన దవాఖానలకు అనుగుణంగా నియామకాలు జరుపుతున్నామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు చేస్తున్నామని వెల్లడించారు. ఒకేరోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించామని, వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డని చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొత్తగా నియమితులైన 1061 మంది అసిస్టెంట్ ఫ్రొఫెసర్లకు (Assitant Proffessors) నియామక పత్రాలను మంత్రి హరీశ్ రావు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. 1331 మంది ఆయుష్ కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించామని తెలిపారు.
2014 నుంచి ఆరోగ్యశాఖలో 22,263 మందిని నియమించామని చెప్పారు. మరో 2 నెలల్లో కొత్తగా 9,222 పోస్టులు భర్తీ చేయనున్నామని వెల్లడించారు. ప్రభుత్వ వైద్య సేవలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని తెలిపారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్లో ప్రస్తుతం 54 రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జూన్ నుంచి 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలోనే కొత్తగా 9 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చామని, ఒక్కో కాలేజీకి సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన ఐదు నెలల్లోనే వై ద్యారోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసింది. 1,147 పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్ 6న నోటిఫికేషన్ ఇచ్చింది. 34 విభాగాల్లో ఈ ఖాళీలను ప్రకటించింది. ఇందులో మల్టీ జోన్-1లో 574 పోస్టులు, మల్టీ జోన్-2లో 573 పోస్టు లున్నాయి. డిసెంబర్ 20 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 2 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరిపారు. 20న రోస్టర్ జాబితాను ప్రకటించారు. మార్చి 28న ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల చేసి అ భ్యంతరాలను స్వీకరించారు. వచ్చిన వాటిని పరిశీలించి, 8న తుది జాబితాను విడుదల చేశారు. వీరిలో 1,061 మంది ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం విధించారు.
కొత్తగా నియామకమైన వారంతా డీఎంఈ పరిధిలోనే పని చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేస్తున్నది. ఆయా కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వైద్యశాఖ ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలు చేపట్టింది. దీంతో మెడికల్ కాలేజీలకు సిబ్బంది సమకూరారు. ఈ నియామకాలతో రాష్ట్రంలో వైద్యవిద్య మరింత బలోపేతం కానున్నది.