మెదక్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రం అనేక విజయాలు సాధించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని, తెలంగాణ దేశానికి తలమానికంగా మారిందని కాబట్టే దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నామని అన్నారు. సోమవారం మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్రావు విస్తృతంగా పర్యటించారు. విద్యుత్తు ప్రగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పెరిగిన విద్యుత్తు బిల్లుల నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టిందని, రాష్ట్రం రావడానికి కారణమైందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత కరెంటు ఇస్తామన్నారని, కానీ.. ఉత్త కరెంటు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలపాలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు బాయిలకాడ మీటర్లు పెట్టమంటున్నదని అన్నారు.
బీజేపీని నమ్మితే గొర్రె కసాయివాడి నమ్మినట్టే ఉంటుందని తెలిపారు. విద్యుత్తు ఉద్యోగుల కొలువులు ఊడుతాయని హెచ్చరించారు. మెదడు కరగదీసి సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడి విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేశారని అన్నారు. దీనికోసం రూ.39 వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ ఏడు గంటల కరెంటు వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్కు 40 ఏండ్లలో చేతకాని పనిని ఆరు నెలల్లో సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటే ప్రజలందరూ చల్లగా ఉంటారని తెలిపారు. విద్యుత్తు ఉద్యోగులు చాలా బాగా పనిచేస్తున్నారని మంత్రి హరీశ్రావు కితాబిచ్చారు. కార్యక్రమాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ జానకిరాములు, డీఈ కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.