హుస్నాబాద్, అక్టోబర్ 10: ప్రజలు సంబరపడితే కాంగ్రెస్, బీజేపీ కన్నీళ్లు పెట్టుకుంటాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజలు సంతోషంగా ఉండడం ఆ రెండు పార్టీలకు నచ్చదని విమర్శించారు.15న సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారంప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్రావు పరిశీలించారు.
సభాస్థలాన్ని పరిశీలించిన అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మూటలు తెచ్చి.. ముఠాలు ఏర్పాటు చేసి.. మతాల పేరుతో మంటలు సృష్టించైనా సరే అధికారంలోకి రావాలని ఆ పార్టీ చూస్తున్నదని ఆరోపించారు. ఆ పార్టీ పరిస్థితి ఢిల్లీలో ఎక్కువ.. గల్లీలో తక్కువ అన్న చందంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. అదో ఎండ్రకాయ పార్టీ అని, ఒకరు పైకి వెళ్తుంటే మరొకరు కిందికి గుంజుతుంటారని విమర్శించారు. అంతర్గత కుమ్ములాటలతో బిజీగా ఉండే కాంగ్రెస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని ఏం పట్టించుకుంటారని ప్రశ్నించారు.
ఫేక్ సర్వేలు, గూగూల్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కర్ణాటక నుంచి డబ్బు మూటలు తీసుకొచ్చి, ముఠాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ ఎన్నికల్లో గెలవాలన్న కుట్రలు సాగుతున్నాయని, మతం పేరుతో మంటలు సృష్టించి అయినా సరే అధికారంలోకి రావడానికి ఆ పార్టీ వెనుకాడదని పేర్కొన్నారు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేని విమర్శించారు. కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసి వందలాది మంది తెలంగాణ ప్రజల చావుకు కారణమైందని ఆరోపించారు.
మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీ కావాలో.. మోటార్లకు మీటర్లు పెడుతున్న బీజేపీ కావాలో.. 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న కేసీఆర్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. తొమ్మిదిన్నరేండ్లలో సుస్థిర పాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్కే చెందుతుందని, ఆయన నాయకత్వంలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా మారిందని వివరించారు. ఇక్కడి పథకాలను దేశమంతటా అమలు చేస్తున్నారంటేనే సీఎం కేసీఆర్ విజన్ ఏమిటో తెలుస్తున్నదని పేర్కొన్నారు.
కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి, దేవేందర్రావు, ఏడు మండలాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
8 టీఎంసీలతో గౌరవెల్లిని పూర్తిచేసి హుస్నాబాద్ను సస్యశ్యామలం చేసేందుకు సన్నాహాలు చేస్తుంటే కాంగ్రెస్, బీజేపీ అడ్డుతగులుతూ కేసులు వేస్తూ ముందుకు పోకుండా చేస్తున్నారని ఆరోపించారు. నీళ్లొస్తున్నాయని ప్రజలు సంబురపడితే కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కన్నీళ్లొస్తున్నాయని విమర్శించారు. ఎవరు అవునన్నా, కాదన్నా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 15న హుస్నాబాద్లో జరగబోయే ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రకటించబోయే మ్యానిఫెస్టోతో ప్రతిపక్ష పార్టీ నాయకుల మైండ్ బ్లాంక్ కావడం ఖాయమని పేర్కొన్నారు.