Harish rao | సంగారెడ్డి, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటున్న మూడు గంటల కరెంటు కావాలా? లేక తెలంగాణ సర్కారు ఇచ్చే మూడు పంటలకు కరెంటు కావాలా? అనేది ప్రజలే తేల్చుకోవాలని మంత్రి హరీశ్రావు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోసం పార్టీ కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు, వీఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలు, రేషన్డీలర్లను ఎగదోసి రాజకీయ లబ్ధిపొందాలని కాంగ్రెస్ దింపుడు కళ్లం ఆశలు పెట్టుకొన్నదని, కాంగ్రెస్ ఆటలను సీఎం కేసీఆర్ సాగన్విలేదని తెలిపారు. శనివారం ఆయన సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో బీసీ, చేతివృత్తులకు లక్ష సాయం చెక్కులు, పేదలకు ఇండ్ల పట్టాలు అందజేశారు.
అనంతరం జిల్లాలో పంట నష్టపోయిన 3,093 మంది రైతులకు రూ.4.04 కోట్ల డబ్బులను పంపిణీ చేశారు. జోగిపేటలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీసీ సాయం చెక్కులు, సింగూరు బాధితులకు ఇండ్ల స్థలాల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బ్రోకర్లు, పైరవీకార్లు, లీడర్ల రాజ్యం తేవాలని కాంగ్రెస్ చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు సరిపోతుందని అంటున్నారని, బీజేపీ పార్టీ బోర్లు, బావుల కాడ మీటర్లు పెట్టాలని వేధిస్తున్నదని తెలిపారు. కానీ, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మూడు పంటలకు కరెంట్ ఇస్తున్నారని చెప్పారు. ఏటా మూడు పంటలు పండించాలనుకునే రైతులు కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ మాట ఇచ్చినట్టుగానే త్వరలోనే రైతుల పంట రుణమాఫీ పూర్తిగా అమలు చేయనున్నట్టు స్పష్టం చేశారు.
బక్కపల్చని కేసీఆర్తోనే రైతులకు మేలు
సీఎం కేసీఆర్ కంటే ఒడ్డు, పొడువు ఉన్నోళ్లు సీఎంగా పనిచేసినా.. బక్కపల్చని కేసీఆర్తోనే అన్నదాతలకు మేలు జరిగిందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడటం లేదని, అందుకే కేసీఆర్పై నోరుపారేసుకొంటున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఒక్క దింపుడు కళ్లెం ఆశకూడా నెరవేరకుండా చేశారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణ దరిదాపుల్లో కూడా ఇతర రాష్ర్టాలు లేవని తెలిపారు.
కేసీఆర్ది సంక్షేమ పాలన
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన సాగిస్తున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. బీసీ, చేతివృత్తులతోపాటు మైనార్టీలకు లక్ష సాయం అందజేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో బీసీలకు రూ.60 వేల సబ్సిడీ ఇచ్చేవారని, అందులో రూ.40 వేల బ్యాంకులోన్ ఉండేదని గుర్తుచేశారు. సబ్సిడీ కోసం లబ్ధిదారులు నెలల తరబడి తిరగాల్సి వచ్చేదని అన్నారు. రాష్ట్రంలో 35 వేల సెలూన్లకు, 60 వేల లాండ్రీలకు ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మాణిక్రావు, క్రాంతికిరణ్, కార్పొరేషన్ చైర్మన్లు చింతా ప్రభాకర్, మఠం భిక్షపతి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ మెసేజ్లు.. అన్నదాతల ముఖాల్లో వెలుగులు
సంగారెడ్డి సమీపంలోని మల్కాపూర్ వద్ద ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు రైతులకు రూ.4.04 కోట్ల పంటనష్ట పరిహారం డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా రైతులు, మంత్రి హరీశ్రావుకు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొన్నది. పంట రుణమాఫీ అయిన రైతులు తమకు సెల్ఫోన్లో వచ్చిన మెసేజ్లను చూపించాలని మంత్రి హరీశ్రావు కోరారు. సమావేశంలో పాల్గొన్న రైతులు ఆనందంగా తమ సెల్ఫోన్లను పైకి ఎత్తిచూపారు. రేవంత్ చెప్పే మూడు గంటల కరెంట్ కావాలా? బీఆర్ఎస్ ఇచ్చే 24 గంటల కరెంట్ కావాలా? అని హరీశ్రావు అడగ్గా.. సభలో పాల్గొన్నవారంతా చేతులు పైకెత్తి 24 గంటల కరెంటే కావాలని నినదించారు. కాంగ్రెస్ నేత రేవంత్ చెప్పే మూడుగంటల విద్యుత్తు కావాలనుకునే రైతులు చేయి ఎత్తాలి అని హరీశ్రావు కోరగా, రైతులు ఎవ్వరూ చేతులు ఎత్తలేదు. ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి ప్రదర్శించాలని రైతులకు హరీశ్రావు సూచించారు.