సిద్దిపేట : దేశంలో దివ్యాంగులను గౌరవించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని, ఒక్కొక్క వికలాంగుడు ఒక్కొక్క కేసీఆర్ కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల ఆత్మ గౌరవం పెంచారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ చేస్తున్నారని, ముందుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఖర్గే మొదట డిక్లరేషన్ చేసి, ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ చేయాలని మంత్రి దుయ్యబట్టారు.
సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో బీడీ టేకేదార్లకు నూతన పింఛను మంజూరు, దివ్యాంగులకు పింఛన్ల పెంపు పత్రాల పంపిణీ, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ క్రమబద్ధీకరణ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దేశంలోని కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉండి వెయ్యి రూపాయల పింఛను మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి పోతే బండి ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేసి ఇప్పటికీ బండి లేదు.. గుండు లేదని ఎద్దేవా చేశారు..
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వెయ్యికి మించి పెన్షన్ ఇవ్వడం లేదని, రాష్ట్రంలో 5 లక్షల 5 వేల 225 మంది దివ్యాంగులు ఉన్నారని, దివ్యాంగులు ప్రేమ కలవారని, మాటమీద ఉంటారని మీరు అడగకున్నా పెన్షన్ పెంచారని చెప్పుకొచ్చారు. గృహ లక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని దివ్యాంగులు దీవించాలని కోరారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీలు చేసేవారు ఉంటే ఎక్కడా కూడా పెన్షన్ ఇవ్వడం లేదని, తెలంగాణలో బీడీ కార్మికులకే కాదు బీడీ టేకేదార్లకు 2016 పెన్షన్ ఇస్తున్నామని వివరించారు.
మనకు అన్నం పెట్టే కేసీఆర్ను మనం కాపాడుకోవాలని కోరారు. జిల్లాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు బాగా పని చేసి జిల్లాకు అవార్డుల పంట పండించారని అభినందించారు. జిల్లాలో 167మందిని రెగ్యులర్ చేస్తున్నామని, మిగిలిన 11 మందిని త్వరలోనే చేస్తామని ధీమానిచ్చారు. సీఎం కేసీఆర్ ఆలోచన వల్లే రెగ్యులరైజేషన్ చేశారనే విషయాన్ని మరువొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలు వంటేరు యాదవ రెడ్డి, కూర రఘోతం రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, తదితరులు పాల్గొన్నారు.