సిద్ధిపేట : అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలని, అన్నీ వర్గాల గురించి ఆలోచించి.. ఇచ్చిన సందేశాన్ని గుర్తించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మతాలను అడ్డు పెట్టుకుని ఎలా విభజించాలని చూస్తారో.. అంబేద్కర్ ఆనాడే చెప్పారని మంత్రి గుర్తు చేశారు. మతతత్వ శక్తుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత చరిత్ర, లక్ష్యాలపైన ‘సంఘం శరణం గచ్చామి’ నాటక ప్రదర్శనను అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి ప్రారంభించారు.
ప్రదర్శన అనంతరం మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగం రచించి, ప్రజల బాగోగులు గురించి అంబేద్కర్ ఎంతగానో ఆలోచించారని మంత్రి కొనియాడారు. నృత్యకళా ప్రదర్శనలో అంబేద్కర్ భార్య రమ పాత్ర ప్రదర్శన చూస్తే నిజంగా కళ్లలో నీళ్లు తిరిగాయని మంత్రి తెలిపారు. అంబేద్కర్ అనగానే చాలామందికి ఆయన రాజ్యాంగ నిర్మాత, బడుగులకు రిజర్వేషన్లు కల్పించిన సంస్కర్త అని మాత్రమే అనుకుంటారు. కానీ, ఆయనలోని అనేక కోణాలను ఈ నాటకం ప్రదర్శించిందని, ఆయన కొందరి వాడు కాదు.. అందరివాడు అని ఢంకా బజాయించి మరీ చెప్పిందన్నారు.
బాల్యంలో పాఠశాల నుంచి అంబేద్కర్ ఎదుర్కొన్న వివక్ష, పట్టుదలతో ఆయన సాధించిన బీఏ, ఎంఏ (ఎకనామిక్స్) డిగ్రీలు, బారిష్టర్ చదువు మధ్యలో ఆగిపోవడం, చదువు కోసం భార్య రమాబాయి పడ్డ కష్టాలు, అనారోగ్యంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకును పేదరికంతో రక్షించుకోలేని దుస్థితిని నాటకంలో గుండెలకు హత్తుకు పోయేటట్లు ప్రదర్శించారని బృందాన్ని మంత్రి అభినందించారు.
అంతకు ముందు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర, సంఘం, శరణం, గచ్చామి పేరిట చేసిన నృత్య రూపకం వీక్షకులను ఆద్యంతం ఆకట్టుకున్నది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు నృత్య రూపకంలో అంబేద్కర్ జీవితం గురించి వివరించారు. బాల్యం నుంచి మొదలు విద్యాభ్యాసంలో ఎదుర్కొన్న అవమానాలు, లండన్ చదువు, పెళ్లి, ప్రజా చైతన్యం, రాజ్యాంగ రూపకల్పన వరకు కండ్లకు కట్టినట్లు ప్రదర్శన నిర్వహించారు.