హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): అన్ని ఏరియా దవాఖానల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. శనివారం ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) దవాఖానల పనితీరుపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. దవాఖానల్లోని విలువైన వైద్య పరికరాల నిర్వహణకు దేశంలోనే తొలిసారిగా ‘బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్’ పాలసీ రూపొందించామని, అన్ని పరికారాలను 10 రోజుల్లో ఏఎంసీ కాంట్రాక్టు పరిధిలోకి తీసుకొనిరావాలని చెప్పారు.
దవాఖానల్లో ఉన్న అన్ని రకాల వైద్య పరికరాలను సమర్థంగా వినియోగించి, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. రోగులకు జిల్లా స్థాయి ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల సేవలు అందేలా చూడాలని, అనవసరంగా హైదరాబాద్కు రిఫర్ చేయడం తగ్గించాలని చెప్పారు. సాధారణ ప్రసవాలను పెంచాలని సూచించారు. గత నెలతో పోలిస్తే పలు దవాఖానల్లో సిజేరియన్ల సంఖ్య తగ్గిందని అభినందించారు.
వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దవాఖానలో తప్పకుండా అందుబాటులో ఉండాలని, సర్జరీలు ఎప్పటికపుడు చేయాలని చెప్పారు. తాను దవాఖానలను ఆకస్మికంగా సందర్శిస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, డీఎంఈ రమేశ్రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్రెడ్డి, అన్ని ఏరియా దవాఖానల సూపరింటెండెంట్లు, డీసీహెచ్ఎస్లు పాల్గొన్నారు.