Telangana | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, సిహెచ్ మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్ నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, గంగుల కమలాకర్, వి శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గత 9 సంవత్సరాలలో ప్రభుత్వ శాఖలు సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, నిర్దేశించిన రోజున ఉత్సవాలు నిర్వహించుటకు తగు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత తొమ్మిదేళ్లలో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టి ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఈ ఉత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఘనంగా నిర్వహించాలని సూచించారు. రాజధాని హైదరాబాద్లో జూన్ 2వ తేదీన నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని, జిల్లా కేంద్రాలలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో, మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాల్గొంటారని ఆయన తెలిపారు.
ఉత్సవాలకు సంబంధించి రూపొందించే డాక్యుమెంటరీ చిత్రాల వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు. ఆయా శాఖలు సాధించిన ప్రధాన విజయాలను సంగ్రహించేలా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ను సిద్దం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. అదే విధంగా ప్రభుత్వం నిర్దేశించిన ఉత్సవాలకు సంబంధించి ఆ రోజు చేపట్టే కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను వెంటనే సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రుల ప్రతిపాదనలు, సూచనలపై చర్చించి తదుపరి సూచనల కోసం ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, డీజీపీ అంజనీకుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, అధర్ సిన్హా, రామకృష్ణారావు, ముఖ్యకార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, జితేందర్, కార్యదర్శులు రాహుల్ బొజ్జా, వాకాటి కరుణ, శ్రీనివాసరాజు, శేషాద్రి, ఎస్ ఎఎం రిజ్వీ, క్రిస్టినా జెడ్ చొంగ్తు, బుద్ధ ప్రకాష్, మున్సిపల్ పరిపాలన విభాగం కమిషనర్ సత్యనారాయణ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహ రెడ్డి, టీఎస్ ఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమా రెడ్డి ఇతర శాఖాధిపతులు పాల్గొన్నారు.