Telangana | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతి కుమారి, మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, అన్ని శాఖల సెక్రెటరీలు, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు హాజరయ్యారు.
రాష్ట్రం ఏర్పడి పదేండ్లవుతున్న సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సంబురాలు జరపనున్నది. దీంతోపాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను వచ్చే నెల 2న సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. అదే సమయంలో మంత్రులు వారివారి జిల్లాల్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. నియోజకవర్గాల్లో మంత్రుల పర్యవేక్షణలో ఎమ్మెల్యేల నేతృత్వంలో ఉత్సవాలు జరుగుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి నివేదనతోపాటు తెలంగాణకే ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్ర నలుమూలలు హోరెత్తనున్నాయి.