హైదరాబాద్ : వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యాధులపై అవగాహన కల్పించడం, వ్యాధి నిర్ధారణ చేయడం, త్వరితగతిన చికిత్స అందించడం వంటివి చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాని, ఈ విషయంలో పంచాయతీ రాజ్ సహా ఇతర శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందంతో ప్రచారం చేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
హైదరాబాద్ వెంగళ్రావ్ నగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసు నుంచి రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏ పరిధిలోని జిల్లాల్లో సీజనల్ వ్యాధులపై మంత్రి హరీశ్రావు మంగళవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మొన్నటి వరకు ఉన్న ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి, వాతావరణం పూర్తిగా చల్లబడింది. రాష్ట్రమంతటా వానలు మొదలయ్యాయి. ఒక్కసారిగా వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలని హరీశ్రావు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్దేశంలో వైద్యం పల్లె ప్రజలకు చేరడంతో పాటు, జ్వర సర్వే, ఇంటింటికి వెళ్లి మందులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పల్లె ప్రగతి, డంపింగ్ యార్డులు, గ్రామానికి ఒక ట్రాక్టర్ వల్ల పారిశుధ్యం మెరుగైంది. మిషన్ భగీరథ ద్వారా శుద్ది చేసిన నీరు ప్రజలకు అందించడం వల్ల నీటి ద్వారా వచ్చే జబ్బులు తగ్గుముఖం పట్టాయి. మొత్తంగా ఒక గుణాత్మక మార్పు వచ్చింది. మలేరియా రహిత రాష్ట్రంగా అడుగులు వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మలేరియా నియంత్రణలో కేటగిరీ 2 నుండి కేటగిరీ 1 కి చేరాము. గత ఏప్రిల్లో కేంద్రం మనకు అవార్డు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు.
మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటివి పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలని హరీశ్రావు సూచించారు. ఒకట్రెండు కేసులు నమోదు కాగానే ఆ ప్రాంతం పై ప్రత్యేక దృష్టి సారించాలి. అవసరం ఉన్న చోట ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయాలి. సత్వర చికిత్స అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించడం, దోమలు, ఈగలు వ్యాప్తిచెందడం కారణంగా వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండడం వల్ల దోమలు, ఈగలు వృధ్ది చెంది అంటు వ్యాధులకు కారణమవుతాయి. అలా జరగకుండా చూసుకోవాలని మంత్రి చెప్పారు.
ఏటూరు నాగారం, ఉట్నూర్ , భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ ఐటిడిఏల పరిధిలోని జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని హరీశ్రావు సూచించారు. మనం ఒక ప్రణాళిక ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఈ సీజనల్ వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడుకోవాలి. కరోనా లక్షణాలు, సీజనల్ వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు నిర్వహించాలి. సమీపంలోనీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల పరీక్షలు చేసే వెసులుబాటు ఉంది. ఐటిడిఏ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేయడం, అత్యవర పరిస్ధితులు ఎదుర్కొనేలా ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేసుకోవడం, సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం వంటివి చేయాలని సూచించారు.
108 వాహనాలు వెళ్ళలేని ప్రాంతాలు ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వాగులు పొంగటం, రోడ్లు ధ్వంసం అవడం వల్ల కొన్ని గిరిజన ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ పోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వ్యాధుల బారిన పడ్డ రోగులతో పాటు గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. బర్త్ వెయిటింగ్ రూమ్లను సద్వినియోగ పరుచుకోవాలని హరీశ్రావు చెప్పారు. జబ్బుల బారిన పడ్డ వారిని గుర్తించడంతోపాటు చికిత్స అందించడం ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడం వంటివి చేయాలి, వారు పూర్తిగా కోరుకునే దాకా పర్యవేక్షణ కొనసాగించాలని హరీశ్రావు ఆదేశాలు జారీ చేశారు.
పంచాయతీరాజ్ శాఖ, వైద్యశాఖలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలదే అని హరీశ్రావు స్పష్టం చేశారు. రోజువారి నివేదికలు తెప్పించుకొని క్షేత్రస్థాయిలో నమోదవుతున్న కేసులను పరిశీలించాలి. సంబంధించిన అధికారులను అప్రమత్తం చేయాలి.రెండు శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడాలని హరీశ్రావు సూచించారు.
ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డి హెచ్ శ్రీనివాస్ రావు, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ ఎంస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం జేడీ అమర్ సింగ్, ఐటీడీఏ పరిధిలోని 11 జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, రాహుల్ రాజ్, భవిష్ మిశ్రా, గౌతం, అనుదీప్, శశాంక, భారతి, కృష్ణా ఆదిత్య, ఉదయ్ కుమార్, రాహుల్ శర్మ, గోపి, ఐటీడీఏ పీవోలు గౌతమ్, వరుణ్ రెడ్డి, అంకిత్, అశోక్, జిల్లా వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.