హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. నిమ్స్లో వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు సాధ్యమైనంత త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బెడ్ ఆక్యుపెన్సి రేటు 100 శాతానికి పెంచాలన్నారు. పీడియాట్రిక్ పాలియేటివ్ సేవల్లో మనం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అడల్ట్ పాలియేటివ్ కేర్ సేవలను అద్భుతంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయాలన్నారు. నిమ్స్, ఎంఎన్జే ఆస్పత్రుల పని తీరుపై మంత్రి హరీశ్రావు నెలవారి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చూసి, జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాల్లో ప్రమాద వశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరపక పోవడం వల్ల, ఆ పేషంట్ అవయవాలు ప్రాణ దానానికి అవకాశం లేకుండా పోతున్నాయి. ఒక వేళ జిల్లాలోని టీచింగ్ ఆస్పత్రుల్లోనే బ్రెయిన్ డెడ్ నిర్ధారించగలిగితే, అవయవాలు సేకరించి, అవసరం ఉన్నవారికి శస్త్ర చికిత్స జరిపి మార్పిడి ద్వారా ప్రాణం కాపాడటం సాధ్యం అవుతుంది. దీనిపై సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, టివీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్లు అధ్యయనం చేయాలి. త్వరలో జిల్లాల్లో బ్రెయిన్ డెడ్ నిర్దారణ పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధారణంగా బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ నుండి కార్నియా, గుండె, కాలేయం, లంగ్స్, కిడ్నీలు సేకరించి, జీవన్ దాన్లో రిజిస్టర్ అయి ఏళ్ల కాలం నుండి ఎదురు చూస్తున్న వారికి అవయవ మార్పిడి చేసి ప్రాణం కాపాడవచ్చు. ఒక్కరి నుండి సేకరించిన అవయవాలు ఐదుగిరి ప్రాణాలు నిలబెడతాయన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నిమ్స్లో 70 అవయవ మార్పిడులు జరిగాయి. గత ఏడాది వంద జరిగాయి.ఈ ఏడాది కూడా వందకు పైగా అవయవ మార్పిడి జరిగేలా పని చేయాలని కోరుతున్నానని హరీశ్రావు పేర్కొన్నారు.
నిమ్స్, ఎంఎన్జే ఆస్పత్రులకు మన రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉందని హరీశ్రావు తెలిపారు. ఎంతో నమ్మకంతో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. వారికి మంచి వైద్యం అందించి విశ్వాసం పొందాలి. నిమ్స్లో పరీక్ష ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలి. అత్యవసర విభాగంలో ఉన్న పేషెంట్లను స్టెబిలైజ్ చేసి వెను వెంటనే అయా విభాగాలకు పంపాలి. కొత్తగా వచ్చే పేషెంట్ల కోసం పడకలు అందుబాటులో ఉంచాలి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆర్ఎంవోలు చొరవ చూపాలన్నారు. వీరు అన్ని వేళలా పేషెంట్లకు అందుబాటులో ఉండాలని హరీశ్రావు ఆదేశించారు. నిమ్స్ బెడ్ ఆక్యుపెన్స్ 77 శాతం ఉంది. ఇది చాలా తక్కువ. ఒకపక్క బెడ్స్ లేవని అంటూనే, ఇక్కడ 27 శాతం బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు రిపోర్టులో ఎలా పేర్కొన్నారు. బెడ్ ఆక్యుపెన్సీ పెంచాలి. వంద శాతం పెరగాలని హరీశ్రావు ఆదేశించారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 83 డయాలసిస్ సెంటర్లలో పనితీరును నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల నెఫ్రాలజీ విభాగం పర్యవేక్షించి మంచి సేవలు అందించేలా చూడాలన్నారు. ఎంఎన్జే అధ్వర్యంలో నడుస్తున్న మొబైల్ స్క్రీనింగ్ క్యాంప్స్ జిల్లాల్లో ఎక్కువగా జరగాలి. క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యాంప్లు పెట్టాలి. వారానికి 3 క్యాంపులు నిర్వహించి క్యాన్సర్ వ్యాధిగ్రస్థులను గుర్తించి చికిత్స అందించాలని మంత్రి సూచించారు. ఇటీవల ప్రారంబించిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు పూర్తిగా వినియోగించాలి. అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలి. 300 పడకల కొత్త బ్లాక్ పనులు దాదాపుగా పూర్తి అయిన నేపథ్యంలో ఫర్నీచర్, పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని హరీశ్రావు సూచించారు.
ఎంఎన్జేలో ఏర్పాటు చేసిన పిడియాట్రిక్ పాలియేటివ్ విషయంలో మనం దేశానికే ఆదర్శంగా ఉన్నాం. అడల్ట్ పాలియేటివ్ కేర్ విభాగంలో మరో 50 పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో 33 పాలియేటివ్ కేర్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా అవసాన దశలో ఉన్నవారికి మెరుగైన సేవలు అందించాలి. ఈ విషయంలో ఉత్తమ సేవలు అందిస్తున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నూతన విధానం రూపొందించాలి. వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు కాబట్టి అందరం బాగా కృషిచేసి ప్రజలకు మంచి వైద్య సేవలు అందిద్దాం అని కోరుతున్నాను అని హరీశ్రావు పేర్కొన్నారు.
ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డి, కమిషనర్ శ్వేతా మహంతి, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి, నిమ్స్, ఎంఎన్జే డైరెక్టర్లు, అన్ని విభాగాల హెచ్వోడీలు పాల్గొన్నారు.