హైదరాబాద్ : మెదక్ – సిద్ధిపేట నేషనల్ హైవేకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే వెళ్లే గ్రామాల వద్ద నాలుగు లైన్ల రోడ్లు, స్ట్రీట్ లైట్స్, సైడ్ డ్రైన్లు, రేలింగ్, ఫుట్పాత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆర్అండ్బీ అధికారులతో మంత్రి మెదక్ – సిద్ధిపేట హైవేకు సంబంధించి రీచ్-1, రీచ్-2 పనులపై సమీక్షించారు. రీచ్ -1 నేషనల్ హైవే సిద్ధిపేట జిల్లాలోని పోతారెడ్డిపేట్ నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు, రీచ్ -2 నేషనల్ హైవే మెదక్ జిల్లాలో మెదక్ టౌన్ నుంచి నిజాంపేట వరకు నిర్మాణం సాగనున్నట్లు మంత్రి తెలిపారు.
మెదక్ నుంచి సిద్ధిపేట వరకు రూ.882.18 కోట్లతో, 69.97 కిలోమీటర్ల వరకు 4 లైన్రోడ్, మెదక్ జిల్లాలో 33.676 కిలోమీటర్లు, సిద్ధిపేటలో 36.302 కిలోమీటర్లలో నాలుగు వరుసల రోడ్డు వేయనున్నట్లు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లాలో పోతిరెడ్డిపేట్, అక్బర్ పేట్, చిట్టాపూర్, హబ్సీపూర్, ధర్మారం, తిమ్మాపూర్, ఇర్కోడు, బూరుగుపల్లి గ్రామాలతో పాటు సిద్ధిపేట పట్టణ పరిధిలో.. మెదక్ జిల్లాలో టౌన్తో పాటు పత్తూరు, అక్కన్నపేట్, రామాయంపేట్, కోనాపూర్, నందిగామా, నిజాంపేట్ గ్రామాలలో నాలుగు వరుసల రోడ్లు వస్తాయని.. దాంతో ఆయా గ్రామాల రూపురేఖలు మారనున్నట్లు పేర్కొన్నారు.
నేషనల్ హైవే రోడ్డు సాగే గ్రామాల వెంట 4 లైన్ రోడ్, స్ట్రీట్ లైట్స్, ఇరువైపులా ప్రమాదాలు జరగకుండా రేలింగ్, ఇరువైపులా వర్షపు నీరు నిలువకుండా సైడ్ డ్రైన్లు, ఫుట్ పాత్లు నిర్మించాలని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో ఎన్సాన్పల్లి జంక్షన్ నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు రెండు వరుసల రోడ్డుతో పాటు ఇరు వైపులా స్థానిక ప్రజల సౌకర్యార్థం సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్సాన్పల్లి సర్కిల్ వద్ద వెహికల్ అండర్ పాస్, సిద్ధిపేటలో హైదరాబాద్ – కరీంనగర్ – రామగుండం రోడ్ వద్ద వెహికల్ ఓవర్ పాస్ నిర్మించనున్నట్లు ఆర్అండ్బీ అధికారులు పేర్కొన్నారు.
మెదక్లో రామాయంపేట ఎన్హెచ్ 44ను క్రాస్ చేసేందుకు వెహికల్ అండర్ పాస్, గజ్వేల్ రోడ్లో రామాయం పేట సమీపంలో మరో వెహికల్ అండర్ పాస్ నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కన్నపేట వద్ద వెహికల్ ఓవర్ పాస్ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. మెదక్ జిల్లాలో అక్కన్నపేట్ వద్ద రైల్వే ట్రాక్ ఉండటంతో అక్కడ వాహనాల పోయేందుకు రైల్ అండర్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు మంత్రికి తెలిపారు. రోడ్ నిర్మాణంతో సిద్ధిపేటలో నాలుగు మేజర్ జంక్షన్లు, 19 మైనర్ జంక్షన్లు మెదక్ జిల్లాలో నాలుగు మేజర్ జంక్షన్లు, 15 మైనర్ జంక్షన్లు అభివృద్ధి కానున్నాయని వివరించారు. రామాయంపేటలో 2.65 కిలోమీటర్లు బైపాస్ రోడ్ రానున్నట్లు మంత్రికి వివరించారు.
పనుల కోసం మెదక్లో 26.82 హెక్టార్లు, సిద్ధిపేటలో 18.25 హెక్టార్ల భూసేకరణ, మెదక్ జిల్లాలో 9.35 హెక్టార్ల అటవీ భూమి సేకరించాల్సి ఉందని అధికారులు చెప్పారు. భూసేకరణకు సంబంధించి పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. అటవీ భూముల సేకరించాల్సి ఉండడంతో ఫారెస్ట్ అధికారులతోనూ మాట్లాడారు. ఆర్యూబీలు, ఆర్వీఓబీలు నిర్మించే చోట్ల వర్షాకాలంలో నీరు నిలువకుండా చూడాలని, అందుకు అనుగుణంగా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైవేలతో గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ నేషనల్ హైవే విభాగం ఈఈ ధర్మారెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, ఇతర అధికారులు, నిర్మాన సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.