హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖకు మంచి పేరు తెచ్చేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆ శాఖ మంత్రి హరీశ్రావు కోరారు. పని చేసే వారిని ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుందన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లు, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, డీఎంహెచ్వోలతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు నిధులు పెంచింది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అవసరమైన అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుతున్నాం. ఇంత చేస్తున్న ప్రభుత్వం మీ నుంచి మంచి పని తీరును కోరుకుంటుంది. కొంత మంది ఏఎన్ఎంలు, ఆశాలు, వైద్యులు, సూపర్వైజర్లు, వైద్యాధికారులు బాగా పని చేస్తున్నారు. పని చేయని వారిని మాత్రం ఉపేక్షించేది లేదు. ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించడంలో అలక్ష్యం వహించవద్దని హరీశ్రావు హెచ్చరించారు.
వైద్య శాఖలో ఈ మధ్య జరిగిన ఘటనలు చాలా బాధాకరమని హరీశ్రావు అన్నారు. వాటిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. తప్పు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదు. నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం సహించదు. సీ సెక్షన్ ఆపరేషన్లు 62 శాతం నుండి 56 శాతానికి తగ్గించాం. దాన్ని 40 శాతానికి తగ్గించాలి. నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైద్య సిబ్బందికి ఇన్సెంటీవ్ ఇస్తోంది. ఆగస్టు నెలలో ఇన్సెంటీవ్ మొత్తం రూ. 16 లక్షలు విడుదల చేయడం జరిగింది. నార్మల్ డెలివరీ చేసిన ప్రతీ ఆశాకు, ఏఎన్ఎంలకు, వైద్యులకు ప్రోత్సహకాలు అందుతాయి. గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లే ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
అన్ని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో టిఫా స్కాన్ సదుపాయం కలిగిన 54 ఆల్ట్రా సౌండ్ మిషీన్లు మరో 15 రోజుల్లో సమకూర్చనున్నామని హరీశ్రావు స్పష్టం చేశారు. దీని వినియోగంపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నాం. అన్ని రకాల పరీక్షలు టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా ఉచితంగా చేస్తున్నాం. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా 250 పడకల మాతా శిశు వైద్య కేంద్రం మరో ఆరు నెలల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏదైనా క్రిటికిల్ కేసులు వచ్చినా తల్లి బిడ్డ ప్రాణాలకు ఎలాంటి అపాయం కలగకుండా కాపాడేందుకు ఈ కేంద్రంలో అత్యాధునిక వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. రక్త హీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో మహిళలకు త్వరలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీశ్రావు తెలిపారు.