ఒమిక్రాన్తో ప్రాణభయం లేదు ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణభయం లేదు. రాష్ట్రంలో రెండు కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆందోళన చెందాల్సిన పనిలేదు. తగిన జాగ్రత్తలు పాటించాలి. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. రాష్ట్రంలో మొదటి డోస్ 98 శాతం పూర్తయింది. రెండో డోస్ దాదాపు 64 శాతం పూర్తయింది.
–సిద్దిపేటలో మీడియాతో మంత్రి హరీశ్
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ‘ఒమిక్రాన్’ వేరియంట్ తెలంగాణలోకీ ప్రవేశించింది. తాజాగా ఇద్దరు విదేశీయుల్లో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఈ నెల 12న విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన కోఠిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కెన్యా దేశానికి చెందిన 24 ఏండ్ల మహిళ, సోమాలియా దేశానికి చెందిన 23 ఏండ్ల యువకుడు ఈ నెల 12న వేర్వేరు విమానాల్లో అబుదాబీ, ఖతార్ మీదుగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారని తెలిపారు. కెన్యా, సోమాలియా ఎట్ రిస్క్ దేశాల జాబితాలో లేవని చెప్పారు. పైగా వీరిద్దరికీ ఎలాంటి లక్షణాలు కూడా లేవన్నారు. కానీ విమానాశ్రయంలో నిర్వహించిన ర్యాండమ్ ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో వీరిద్దరికీ కరోనా పాజిటివ్గా తేలిందని చెప్పారు. నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా మంగళవారం వచ్చిన ఫలితాల్లో ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని వెల్లడించారు. వీరిద్దరూ హైదరాబాద్లోని టోలిచౌకి ప్రాంతానికి చెందినవారేనని చెప్పారు. కెన్యా మహిళను గుర్తించామని, పోలీసుల సాయంతో టిమ్స్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరిని ఐసొలేషన్లో ఉంచామని తెలిపారు. వారి నమూనాలను కూడా పరీక్షలకు పంపామని వివరించారు. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని, అతడితో సన్నిహితంగా ఉన్నవారిని సైతం గుర్తిస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. వీరిద్దరితోపాటు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన మరో ఏడేండ్ల బాలుడికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలిపారు. అయితే బాలుడు విమానాశ్రయం నుంచి బయటికి రాకుండా పరీక్షల అనంతరం కుటుంబసభ్యులతో కలిసి నేరుగా పశ్చిమ బెంగాల్కు వెళ్లినట్టు వెల్లడించారు. ఈ వివరాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు అందజేశామని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ప్రయాణించిన విమానంలోని ఇతర ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నామని, వారికి కూడా పరీక్షలు చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ర్టానికి చెందిన ఎవరికీ ఒమిక్రాన్ సోకలేదన్నారు. రాష్ట్రంలో నూతనంగా నమోదవుతున్న కరోనా కేసులకు సంబంధించి 5 శాతం నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నామని వెల్లడించారు.
ఒమిక్రాన్ నెల రోజుల్లోనే దాదాపు 77 దేశాలకు విస్తరించిందని శ్రీనివాసరావు గుర్తుచేశారు. మనదేశంలోకి సైతం ఇటీవలే ప్రవేశించిందని, తెలంగాణలోకి ఏ క్షణంలోనైనా రావొచ్చని ముందే ఊహించామని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హోం ఐసొలేషన్ కిట్లు, ఆక్సిజన్ తగినంత అందుబాటులో ఉన్నాయని చెప్పారు. చికిత్స అందించేందుకు వైద్యసిబ్బంది సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తున్నది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు. ఈ వేరియంట్లో జలుబుతోపాటు కొవిడ్ లక్షణాలు కలిసి ఉంటున్నాయని అన్నారు. జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తీవ్ర నీరసం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొన్ని చోట్ల వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో, ఇప్పటికే కొవిడ్ వచ్చి తగ్గినవారిలో కొందరికి ఒమిక్రాన్ సోకినట్టు నివేదికలు ఉన్నాయని తెలిపారు. ఒమిక్రాన్ను సంపూర్ణంగా ఎదుర్కోవాలంటే మాస్కే మన ఆయుధమని చెప్పారు. మాస్కు, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరంతో 90 శాతం తప్పించుకోవచ్చని వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ప్రాణహాని తప్పుతున్నదని చెప్పారు. ఒమిక్రాన్ వల్ల మరణించే ప్రమాదం తక్కువేనని తెలిపారు.
ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని శ్రీనివాసరావు కోరారు. దుష్ప్రచారం చేసేవారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గత వారం రోజుల్లోనే మాస్కులు వేసుకునేవారి సంఖ్య 50 శాతానికి పెరిగిందని, త్వరలోనే 100 శాతానికి చేరుకొంటుందని చెప్పారు. పండుగలు, వివాహాల వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో మంగళవారం నాటికి 4,19,22,053 కొవిడ్ డోసులు వేశామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఒమిక్రాన్తోపాటు ఎలాంటి వేరియంట్ వచ్చినా లాక్డౌన్ విధించే ప్రసక్తి లేదన్నారు. పాజిటివ్లు ఎక్కువగా వచ్చిన ప్రాంతాల్లోనే ఆంక్షలు విధించే అవకాశం ఉన్నదని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఇద్దరు టోలిచౌకి ప్రాంతానికి చెందినవారే కావడంతో అధికారులు ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. కెన్యా మహిళను గుర్తించిన కాలనీలో ర్యాండమ్గా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆ ఇంటితోపాటు గల్లీ, కాలనీల్లో విస్తృతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించనున్నారు. ఒకవేళ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైతే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించే అవకాశమున్నది. తద్వారా వేరియంట్ మరో ప్రాంతానికి విస్తరించకుండా అడ్డుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. పాజిటివ్ వచ్చిన వారిని ఐసొలేషన్లో ఉంచి, మళ్లీ ఎనిమిదో రోజున, 14వ రోజున పరీక్షలు నిర్వహించనున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణభయం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేటలో మీడియాతో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మొదటి డోస్ 98 శాతం పూర్తయిందని, రెండో డోస్ దాదాపు 64 శాతం పూర్తయిందని వెల్లడించారు. బూస్టర్ డోస్ వేయడంపై కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచామని, ముందస్తుగా 21 లక్షల ఐసొలేషన్ కిట్లు సిద్ధం చేశామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లోని 25,390 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలంతా మాసులు ధరించాలని, భౌతికదూరం, వ్యక్తిగత శుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు.