మెదక్: రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిఏడాది బడ్జెట్లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శశoగా నిలుస్తున్నదని వెల్లడించారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు వనదుర్గాదేవికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుటూ.. మెదక్ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయరన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడుపాయలకు ప్రతియేటా నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు.
ప్రజలంతా గర్వపడేలా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగుతున్నదని తెలిపారు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దామని, కొండగట్టు అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. వేద పండితులు, బ్రాహ్మణులు, దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. హిందుధర్మ పరిరక్షణ కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు.