మెదక్ : ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. అంతకు ముందు ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 1500 కోట్లు కేటాయించారు. అందులో భాగంగా ఏడుపాయలకు 100 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు.
100 కోట్లతో ఫౌంటెన్స్, ఇతర అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ను సింగూర్కు లింక్ చేయడం వల్ల ఏడుపాయల్లో నీళ్లు ఎప్పుడు ఉంటాయి. సీఎం కేసీఆర్ కృషితో సింగూర్కు నీళ్లు వస్తున్నాయని ఆయన అన్నారు. గతంలో నీళ్ల కొరత ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించిన్నప్పుడు పనులు కానేకావు అని హేళన చేశారు.
నాడు హేళన చేసిన వారే నేడు పొగుడుతున్నారని మంత్రి గుర్తు చేశారు. మల్లన్నసాగర్ అంటే జల ప్రవాహిని. మల్లన్నసాగర్ నీళ్లతో మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. మంత్రి వెంట మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత తదితరులు ఉన్నారు.