Harish Rao | మెదక్ : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లా తూప్రాన్ పర్యటనలో భాగంగా మనోహరాబాద్లో నూతనంగా నిర్మించిన పీహెచ్సీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మనోహరాబాద్లో పీహెచ్సీ ప్రారంభోత్సవం చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. మనోహరాబాద్ మండలం చేయాలన్న దశాబ్దల కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారు. ఈ రోజు మనోహరాబాద్ మండలమైంది. ఈ మండలంలో 24 గంటలు పనిచేసే పీహెచ్సీ ప్రారంభించుకుంటున్నాం. ఉచితంగా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ప్రజలకు ఉంటాయన్నారు. గర్భిణీలకు చెకప్లు కూడా ఇక్కడ జరుగుతాయని మంత్రి తెలిపారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే మనోహరాబాద్ మండలం అయ్యేదా..? ఇక్కడ ఇంతటి అభివృద్ధి జరిగేదా? అని మంత్రి అడిగారు. త్వరలో మనోహరాబాద్కు పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తాం. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిల్లో 76 శాతం డెలివరీలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ తెచ్చి డెలివరీ అయ్యాక అమ్మ ఒడి వాహనాల్లో ఇంటి దగ్గర దింపుతున్నాం. ఈ రోజు పేద ప్రజల కష్టాలు అర్థం చేసుకుని కష్టాలు తీరుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి. ఎండాకాలంలో కూడా హల్దీ వాగు పారుతుంది అంటే కేసీఆర్ కృషివల్లే సాధ్యమైంది. తాగడానికి మంచినీళ్లు లేనటువంటి ప్రాంతంలో ఈరోజు ప్రతి ఇంటికి నీళ్లు వచ్చాయంటే కేసీఆర్ కృషి వల్లేనని చెప్పారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తానంటే నమ్ముతారా? ఈరోజు కేసీఆర్ వచ్చారు కాబట్టి రైతుకు విలువ పెరిగింది. భూమికి ధర పెరిగింది. సద్ది తిన్న రేవు తలవాలి .. పనిచేసిన కేసీఆర్ను ఆశీర్వదించాలి అని హరీశ్రావు కోరారు.