బోధన్/మాక్లూర్/నందిపేట్, నవంబర్ 18: కాంగ్రెస్ పాలన వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవని, ఒకనాడు రైతులు కరెంట్ కోసం ఎంతో గోస పడ్డారని, మళ్లీ ఆ కష్టాలు రాకూడదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో, 24 గంటల కరెంటిచ్చి రైతులను ఆదుకొనే బీఆర్ఎస్ కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ‘కాంగ్రెసోళ్లు కొత్తకొత్త మ్యానిఫెస్టోలతో వస్తున్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అమలు చేస్త్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో 3-4 గంటల కరెంట్ కూడా ఇవ్వటం లేదు. ఆ సమయంలోనూ 20 నుంచి 30 సార్లు ట్రిప్ అవుతున్నది. ఇలా కరెంట్ ఇస్తే మన రైతులు బతుకుతారా? ఈ ట్రిప్పుల కరెంటు తిప్పలు మనకొద్దు’ అని పిలుపునిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత కరెంట్ అంటూ ఉత్తుత్తి కరెంట్ ఇచ్చారని, ఏ రాత్రి వస్తుందో తెలియని కరెంట్ కోసం రైతులెందరో బావుల దగ్గర, పాములు, తేళ్లు కుట్టి ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తుచేశారు. శనివారం నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన హరీశ్రావు.. బోధన్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్షోల్లో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి 3 గంటల కరెంట్ ఇస్తే మూడు ఎకరాలు పారుతాయని అంటున్నాడు. మరి 3 గంటల కరెంట్ సరిపోతుందా? బీఆర్ఎస్ పాలనలో కరెంట్తో పాటు రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయి. పండిన ప్రతి గింజను కొంటున్నాం. కాంగ్రెస్కు ఓటేసి కర్ణాటక లెక్క ఆగమాగం కావొద్దు’ అని ఓటర్లను కోరారు.
ముస్లింల పేదరికానికి 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనే కారణమని, ఆ పార్టీ పాలనలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ఎలాంటి కృషి జరగలేదని హరీశ్రావు విమర్శించారు. కొద్దిసేపు ఉర్దూలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ సెక్యులర్ లీడర్ అని, బీఆర్ఎస్ పాలనలో ఎక్కడా మతకలహాలు జరగలేదని అన్నారు. మైనార్టీ పిల్లల విద్య కోసం 204 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేశామని, విదేశాల్లో చదువు కోసం రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. 10 వేల మంది ఇమామ్లకు నెలకు రూ.5 వేలు చొప్పున ఇస్తున్నామని, మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సహాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కోసం పని చేస్తున్న ఎమ్మెల్యేలు షకీల్, బిగాల గణేశ్గుప్తా, జీవన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అరవై ఏండ్ల పాలనతో మనల్ని ఆగం జేసిన కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం మళ్లీ కొత్తకొత్త హామీలతో ముందుకు వస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హరీశ్రావు సూచించారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేసి రిస్క్ తెచ్చుకోవద్దని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఓట్లు వేయించుకొని ఢిల్లీలో కూర్చుంటారని, బీఆర్ఎస్ పార్టీ మన ఇంటి పార్టీ అని ఎప్పుడూ తెలంగాణలోనే ఉండి ప్రజలకు సేవలందిస్తుందని వివరించారు. గ్యారెంటీలతో కర్ణాటక ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక రాహుల్గాంధీ జాడలేడు, ప్రియాంక గాంధీ పత్తా లేదని, అక్కడి ప్రజలు లబోదిబోమంటున్నారని వెల్లడించారు.
కేసీఆర్ అంటే ఒక నమ్మకమని, ప్రజలకు కేసీఆర్ పట్ల విశ్వాసముందని, ప్రతి ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలుచేశారని హరీశ్రావు అన్నారు. ఓట్ల కోసం, ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మ్యానిఫెస్టో ఝూటా మ్యానిఫెస్టో అని ధ్వజమెత్తారు. ఆ మ్యానిఫెస్టోను నమ్మితే కర్ణాటక ప్రజలకు పట్టిన గతే మనకూ పడుతుందని హెచ్చరించారు. బీడీ కార్మికులను పరేషాన్ చేస్తూ కాంగ్రెస్ పుర్రె గుర్తు పెడితే, బీజేపీ జీఎస్టీ తెచ్చిందని గుర్తుచేశారు. ఇండియాటుడే సర్వేలో కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని స్పష్టమైందని పేర్కొన్నారు.