కామారెడ్డి : ఎన్నికలంటే ఓట్ల పండుగ కాదు ఐదేళ్ల భవిష్యత్తు. అమెరికా నుంచి వచ్చిన వాళ్లు నాయకులను డబ్బు సంచులతో కొనాలని చూస్తున్నారు. కానీ ఎల్లారెడ్డి ప్రజలను కొనలేరని మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. ఎల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సురేందర్కు మద్దతుగా ఎల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షో(Road show)లో పాల్గొని మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు అని చెప్పి నట్టేట ముంచింది. ఎవరికైనా అనుమానం ఉంటే కర్ణాటక సరిహద్దు దగ్గరే ఉంది కాబట్టి స్వయంగా వెళ్లి తెలుసుకోవచ్చన్నారు.
గత బీజేపీ పాలనలో 9 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4, 5 గంటలు మాత్రమే ఇస్తుంది. తమ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని అక్కడి రైతులు చెప్తున్నరు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటలు కరెంట్ చాలు అంటున్నడు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 5 గంటలు చాలు అంటున్నడు. 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఉండగా కాంగ్రెస్ ని నమ్మి మోసపోదామా? గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత కరెంట్ అని చెప్పి ఉత్తుత్తి కరెంట్ చేసింది నిజం కాదా?
రాత్రి పూట కరెంట్ ఇస్తే పాములు, తేళ్లు కరిచి, కరెంట్ షాకులు కొట్టి రైతులు చనిపోయింది వాస్తవం కాదా? కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలంటే కారుకే గుద్దాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు దేవుడెరుగు కానీ ఆర్నెల్లకు ఒక సీఎం మారుడు మాత్రం పక్కా అని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.