సిద్దిపేట : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సిద్ధిపేట పట్టణంలో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారని, ఆ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరోప్, వివిధ దేశాలలో ఉండే తెలంగాణ ప్రాంత వాసులు ప్రపంచ వ్యాప్తంగా బోనాల పండుగ జరుపుతూ మన ప్రాంత, ప్రజల సంస్కృతి, సంప్రదాయం కాపాడే ప్రయత్నం జరుగుతున్నదని స్పష్టం చేశారు. ఈ మేరకు పట్టణ ఐదవ వార్డులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో జరుగుతున్న బోనాల జాతర ఉత్సవంలో ఆదివారం హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎంత చదివినా, దేశ, విదేశాలకు వెళ్లినా మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందజేసే విధంగా అందరూ కలిసికట్టుగా ఈ సంప్రదాయాన్నికొసాగించడానికి కృషి చేయాలని కోరారు.
పట్టణంలోని 39వ వార్డు పరిధిలో బీఆర్ఎస్ నాయకులు పైసా రామకృష్ణ తనయుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం మంత్రి హరీశ్ రావు వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. పట్టణంలోని భారత్ నగర్ లో సత్యసాయి సమితి మెంబర్ చీకోటి విశ్వనాథ్ ఇటీవల మృతి చెందగా మంత్రి వారి కుటుంబాన్ని పరామర్శించారు.