హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ ప్రధాన వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. రామయ్యకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు.
బుధవారం ఉదయం వనజీవి రామయ్య.. ఖమ్మం జిల్లాలోని పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా మరో బైక్ వచ్చి ఆయనను ఢీకొట్టింది. దీంతో ఆయన కాలికి గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
కాగా, పద్మశ్రీ వనజీవి రామయ్య ఆరోగ్యంపై ఎంపీ సంతోష్ కుమార్ ఆరా తీశారు. ఖమ్మం ప్రభుత్వ దవాఖాన వైద్యులతో మాట్లాడిన ఆయన రామయ్య ఆరోగ్యం మెరుగయ్యేందుకు అవసరమైన వైద్య సహాయం అందించాలని కోరారు.
వనజీవి రామయ్య ప్రమాదానికి గురవడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. రామయ్యకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో రామయ్య కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తనకు అందించాలని డాక్టర్లకు స్పష్టం చేశారు.