హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించనున్న 9 మెడికల్ కాలేజీలను జూలై నాటికి సిద్ధం చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరంలోనే తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు.
కొత్త కాలేజీల పనుల పురోగతిపై ఆయా జిల్లాల మంత్రులు సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి సమీక్షించారు. జూలై నాటికి తరగతులు ప్రారంభించేందుకు అన్ని వసతులు కల్పించాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు తరుచూ సమీక్షలు నిర్వహించి ఫర్నిచర్, ఇతర పరికరాల సరఫరా పనులను వేగవంతం చేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని హరీశ్రావు పేర్కొన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పటికే 17కు పెరిగిందని గుర్తు చేశారు. ఈ ఏడాదితో ఆ సంఖ్య 26కు చేరబోతున్నదని చెప్పారు.