హైదరాబాద్ : ప్రతి నది, వాగుల మీద చెక్డ్యాంలు కట్టి ఎక్కడికక్కడ వరద నీరు ఒడిసిపట్టాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో చెక్ డ్యాంల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్రావు సమాధానం ఇచ్చారు.
ఖ్యంగా తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్ల కోసమే అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సాగునీటిపై దృష్టి సారించకపోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు పెరిగాయన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సాగునీటిపై దృష్టి పెట్టి పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తి చేశారు.
రాష్ట్రంలో భారీ రిజర్వాయర్లను నిర్మించి.. వరద నీటిని వాటిలో నిల్వ చేసి రాష్ట్ర ప్రజలకు 365 రోజులు సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడటమే కేసీఆర్ ధ్యేయమని మంత్రి తేల్చిచెప్పారు. వాటిలో భాగంగానే తెలంగాణలో అనేక ప్రాజెక్టులు, జలాశయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం అమలు చేయడం, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 3.09 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయని, అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6.03 మీటర్లు పెరిగాయని మంత్రి వెల్లడించారు.