సిద్దిపేట, ఆగస్టు 4 : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి.. బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్ల కాలంలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. గురువారం సిద్దిపేట జిల్లా ఇమాంబాద్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు డాక్టర్ సత్యం, భిక్షపతితోపాటు బీజేవైఎం, బీజేపీ కిసాన్మోర్ఛా నాయకులు వంద మంది, నంగునూరులోని పలు పార్టీల నాయకులు మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా 24 గంటల కరెంట్, ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో అమలవుతున్న కేసీఆర్ కిట్టు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని అడిగారు. ఇలాంటి పథకాలు వద్దని బీజేపీ నాయకులు అంటున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఈ పథకాలు వస్తాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని, ఇచ్చే దాంట్లో కోతలు పెడుతున్నదని తెలిపారు. గ్యాస్ సిలిండర్లు, సబ్సిడీలు ఎత్తి వేసి, ధరలు పెంచిందని మండిపడ్డారు. ఉచితంగా కరెంట్ ఇస్తే బాయిలకాడ మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నదన్నారు. రాష్ర్టాల మెడలపై కత్తిపెట్టి విద్యుత్తు సంస్కరణలు తేవాలని చూస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉన్నదని తెలిపారు. కేంద్రం వివక్ష చూపినా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు అండగా నిలిచిందన్నారు. రైతులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తే.. రైతును ముంచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు పనిచేస్తున్నదని విమర్శించారు. రైతులకు పెట్టుబడి వ్యయాన్ని పెంచి, మద్దతు ధరను అంతంత మాత్రంగానే చెల్లిస్తున్నదన్నారు. బీజేపీ సర్కారు ఎరువుల ధరలు పెంచడంతోపాటు రైతులకు సబ్సిడీలు ఎత్తివేసిందని చెప్పారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.