జగిత్యాల, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): 8 ఏండ్ల పాలన దేశాన్ని బీజేపీ అప్పుల కుప్పగా మార్చిందని, నెలకు లక్ష కోట్ల అప్పులు చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కోటి కోట్ల అప్పులు చేసిందని, ప్రతి పౌరుడి తలపై రూ.1.24 లక్షల భారం మోపిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే చెందుతుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలాతోక లేకు ండా మాట్లాడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన రుణాలపై ఆయన మాటలు హాస్యాస్పదమని ఎద్దేవాచేశారు. జగిత్యాలలో 7న కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు బీజేపీపై నిప్పులు చెరిగారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాటలు వింటే సోయి ఉండి మాట్లాడుతున్నారా? అని అనిపిస్తున్నదని పేర్కొన్నారు. జీఎస్టీ కింద తెలంగాణకు ఎనిమిదన్నర వేల కోట్లు ఇచ్చామంటున్నారని.. వాస్తవానికి ఇచ్చింది ఏమీ లేదన్నారు. తెలంగాణే జీఎస్టీ, సెస్సుల కింద కేంద్రానికి 30 వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. రాష్ర్టాలకు కేంద్రం పన్నుల వాటా పెంచిందనటం పచ్చి అబద్ధమని మండిపడ్డారు. కేంద్రం రాష్ర్టాలకు పన్నుల్లో 42 శాతం ఇస్తుందనటం సరికాదని, నికరంగా ఇచ్చేది 29.6 శాతమేనని వివరించారు. 42 శాతం లెక్కన లక్ష కోట్లు రావాల్సి ఉందని, వాటిని కిషన్రెడ్డి తీసుకొనిరావాలని డిమాండ్ చేశారు. ఆయనవన్నీ అబద్ధాలని, చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రాష్ట్రాలకు పన్నుల రూపంలో నిధులు రాకుండా కేంద్రం దొడ్డిదారిన డబ్బులు మళ్లిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాడల్ సూల్స్, బీఆర్జీఎఫ్ వంటి పథకాల రద్దుతోపాటు, సాంఘిక సంక్షేమం, గిరిజన, మహిళ సంక్షేమశాఖల్లో నిధుల్లో కోత విధిస్తున్నదని చెప్పారు. దీంతో ఆ పథకాల నిర్వహణ భారం రాష్ట్ర ప్రభుత్వాలపై పడి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు.
బ్లాక్మెయిల్ రాజకీయాలకు బీజేపీ పాల్పడుతున్నదని, ఎన్నికలు వచ్చే రాష్ర్టాల్లో ఈడీ, ఐటీ తనిఖీలు చేయిస్తున్నదని మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ తలవంచదని, గట్టిగా పోరాడుతుందని స్పష్టంచేశారు. బీజేపీ పెట్టించే పార్టీలు, వదిలే బాణాలు, కుట్రలు..ఉద్యమాల గడ్డపై నడువబోవని తేల్చిచెప్పారు. బీజేపీది అధికార యావ అయితే, టీఆర్ఎస్ది ప్రజల తోవ అని పేర్కొన్నారు. బీజేపీ నాయకుల యాత్రలు చూస్తుంటే.. టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో స్థలం దొరక్క తిరిగి వెళ్లేంత మంది కూడా ఉండటం లేదని, వారి పాదయాత్రలు వెలవెలబోతున్నాయని ఎద్దేవాచేశారు.
కేంద్రం ఎంఎంఆర్(మాతృ మరణాల నిష్పత్తి) తగ్గుదల లెకలను విడుదల చేస్తే, అందులో డబుల్ ఇంజిన్ ఉత్తరప్రదేశ్ చివరిస్థానంలో ఉన్నదని, తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరుచేసినా, తెలంగాణకు ఒక్కటీ ఇవ్వకుండా వివక్ష ప్రదర్శించిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పటికే 17 ప్రారంభమయ్యాయని చెప్పారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, ఆశన్నగారి జీవన్రెడ్డి, సుంకె రవిశంకర్, చెన్నమనేని రమేశ్బాబు, దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్రావు, ఎల్ రమణ, పాడి కౌశిక్రెడ్డి, జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ వసంత, మున్సిపల్ చైర్పర్సన్లు శ్రావణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.