హుజురాబాద్ : “తెలంగాణ వచ్చాక మహిళలకు సకాలంలో రూ .5 లక్షలపైగా రుణాలు అంది స్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్త్రీ నిధి రుణాల పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు తోపాటు, జెడ్పీ ఛైర్ పర్సన్ విజయ, మాజీ మంత్రి పెద్ది రెడ్డిలు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీలేని రుణాలు లబ్ధిదారుల ఖాతాల్లో రేపటి నుంచి జమ చేస్తున్నామని” తెలిపారు.
“2.34 కోట్ల వడ్డీలేని బ్యాంక్ లింకేజీ రుణాలు జమ్మికుంట మహిళ సంఘాలకు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.స్త్రీ నిధి పథకంలో వడ్డీలేని రుణం కింద కోటి 84 లక్షలు రూపాయలు ఖాతాల్లో జమచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఇవి కాకుండా కొత్తగా రూ.10 కోట్ల బ్యాంకు లింకేజీ, మరో కోటి రూపాయలు స్త్రీనిధి కింద లోన్లు మంజూరు చేస్తున్నామని,తెలంగాణ వచ్చాక.. మహిళలకు 5 లక్షల పైన రుణాలు సకాలంలో అందిస్తున్నామని “మంత్రి హరీశ్ రావు తెలిపారు.
“మైక్రోఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల బెడద లేకుండా ప్రభుత్వం మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తోందని, వడ్డీలేని రుణం కింద రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసేందుకు బడ్జెట్ లో 3 వేల కోట్లు పెట్టామని, ప్రభుత్వం ఏ లబ్ధి అందించినా.. మహిళల పేర్లపైనే ఇస్తున్నట్లు ఆయన వివరించారు. “కల్యాణలక్ష్మి పథకం మొదట్లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చాం. ఇప్పుడు అన్ని కులాల్లోని నిరుపేదలకు రూ. లక్షా 116 ఇస్తున్నామని, కల్యాణ లక్ష్మి డబ్బులు అత్తవారికి చెందకుండా.. వధువు తల్లిపేరుతో ఇస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు.. మగపిల్లాడు పుడితే 12 వేలు, ఆడపిల్ల పుడితే 13 వేలతోపాటు, కేసీఆర్ కిట్టు అందిస్తున్నామని” ఆయన పేర్కొన్నారు.
“టీడీపీ, బీజేపీ పొత్తుల ప్రభుత్వం నడిపినప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటే భయపడేవారు. “నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు” అనే… పాటను నేడు.. “నేను పోతా సర్కారు దవాఖానకు” అనేలా మార్చాం అని హరీశ్ రావు చెప్పారు. 57 ఏండ్లు నిండిన వాళ్లకు ఫించను ఇస్తామన్న హామీ కరోనా వల్ల ఆలశ్యమైంది. ఇచ్చిన మాట ప్రకారం 1-2 నెలల్లోనే అందరికీ ఇస్తామని ఆయన వెల్లడించారు. “ఆసరా ఫించను పుణ్యామా అని కోడళ్లు అత్తలను బాగా చూసుకుంటున్నారు. అత్తలే .. కోడళ్లకు ఆసరాగా మారారు. తెలంగాణ రాకముందు కరెంటు, సాగునీటి పరిస్థితి ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందన్నదీ మీకు తెలుసని” అన్నారు.
“వారం, పది రోజుల్లాగా.. 50 వేల వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేస్తున్నాం. మార్చి తర్వాత లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ వడ్డీతో సహా మాఫీ చేస్తాం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇవ్వాల్సి ఉంది. అవి కూడా గత మంత్రి ఈటెల నిర్లక్ష్యం వల్ల పూర్తి చేయలేదని” అన్నారు. “కేసీఆర్ రాష్ట్రం వస్తే జైత్ర యాత్ర, లేకపోతే నా శవ యాత్ర అని కేసీఆర్ ఉద్యమానికి బయలుల్దేరాడు. అలాంటి కేసీఆర్ సత్తా మీకందరికీ తెలుసు.. అనుకున్నవన్నీ చేస్తారు. గతంలో ఇక్కడ ఒక్క మహిళా భవనం లేదు. ఇప్పుడు రూ.3కోట్లతో 20 గ్రామాల్లో 20మహిళ భవనాలు మంజూరు చేశాం. త్వరలో మరో 50వేల ఉద్యోగాలు ప్రకటించ బోతున్నాం”అని హరీశ్ రావు తెలిపారు.