Harish Rao | సంగారెడ్డి : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మూడేండ్ల కృషితో బీరప్ప దేవాలయ నిర్మాణ కల నెరవేరబోతుంది అని హరీశ్రావు తెలిపారు. పార్టీలకు అతీతంగా దేశం మెచ్చిన నేతగా కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. గొల్ల, కుర్మలకు ఐదు వందల కోట్ల విలువైన భూమిని అందించి ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నాం అని తెలిపారు. విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేతి వృత్తులు చేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు రూ. లక్ష అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.
తెల్లాపూర్లో విశ్వ బ్రాహ్మణ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ. 50 లక్షలు ప్రకటించటం అభినందనీయం అని హరీశ్ రావు అన్నారు. తెల్లాపూర్ మునిసిపాలిటీకి అన్ని సౌకర్యాలు, హంగులు సమకూర్చడంతో పాటు త్వరలోనే మునిసిపాలిటీ భవనం, వ్యవసాయ మార్కెట్, పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు.