సిద్దిపేట : మీ నిశ్శబ్దం వీడండి.. బహిరంగంగా చర్చించండి.. రుతుప్రేమ ప్రయోజనాలు వివరించండి.. రుతుప్రేమ లేకపోతే.. జీవనమే లేదు. మానవ మనుగడను శాసించేది రుతుచక్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో రుతు ప్రేమ ప్రారంభ కార్యక్రమానికి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ మేరకు ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంతో పాటు స్వచ్ఛ సిద్ధిపేట జిల్లాకు పాటు పడదామని దిశానిర్దేశం చేశారు. మీకు ఆరోగ్య వంతమైన, సౌకర్యవంతమైన, శాస్త్రీయమైన రుతుచక్రం పై మీకు అవగాహన కల్పించేందుకు ఈ రుతుప్రేమ కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు.
సిద్ధిపేట జిల్లాలో ఇప్పటికే 3 వేల మందికి రుతుప్రేమ మెన్స్ట్రు వల్ కప్పులు అందించినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని మహిళా పంచాయతీ కార్యదర్శిలు, ఆశాకార్యకర్తలు, ఏఎన్ఏంలు అలాగే మహిళా గ్రామ సర్పంచ్లు, ఏంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పట్టుబడితే.. కానిదేమీ లేదు. రుతుప్రేమ విజయవంతం చేసేందుకు మీరంతా నడుం బిగించాలని మంత్రి పిలుపునిచ్చారు. మొదట మీరు ఉపయోగిస్తే.. మీరే మోటీవేటర్లుగా.. అందరిలో స్ఫూర్తిని నింపిన వారవుతారని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే అన్నీ కస్తూర్భా, రెసిడెన్షియల్ పాఠశాలలలోని విద్యార్థినులకు రుతుప్రేమ కప్పులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పాటు పడటంతో పాటుగా మీ ఆరోగ్య రక్షణ చేయాలన్నదే మా ధ్యేయమని మంత్రి చెప్పారు.