హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల వెంట ఉండే సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కేసీఆర్ గొప్ప మానవతావాది. మానవత్వానికి మారు పేరు సీఎం కేసీఆర్ అని హరీశ్రావు కొనియాడారు. ఉస్మానియా ఆస్పత్రిలో మూడు పూటలా భోజనం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రం వచ్చిన తొలి రోజుల్లోనే పేదలు కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కిలో బియ్యాన్ని ఒక్క రూపాయికే అందించారని మంత్రి తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం ఎంత మంది ఉన్న ఒక్కొక్కరికి 4 కేజీల చొప్పున.. మొత్తం 20 కేజీలకు మించకుండా ఇచ్చేవారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికి 200 గ్రాముల చొప్పున ఆహారం అందించేవారు. అర్ధాకలితో బాధపడుతున్న పిల్లలను గుర్తించి, సన్న బియ్యంతో భోజనం పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ఇవాళ అన్ని హాస్టళ్లలో సన్నబియ్యంతో తిన్నంత భోజనం పెడుతున్నారు.
కేసీఆర్ గతంలో ఆస్పత్రులను సందర్శించినప్పుడు రోగుల సహాయకుల బాధలను గమనించారు. తద్వారా రోగుల సహాయకులకు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నైట్ షెల్టర్లు నిర్మించాలని ఆదేశించారు. ఆ పని కొన్ని చోట్ల పూర్తయిందన్నారు. రోగుల సహాయకులకు కూడా భోజనం అందించాలని సూచించారు. ఈ క్రమంలోనే రోజుకు 20 వేల మందికి రూ. 5 కే అన్నం పెట్టే కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. హరే రామ హరే కృష్ణ సంస్థతో ఒప్పందం చేసుకుని ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ప్రతి భోజనం మీద రూ. 21 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమానికి రూ. 40 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. ఒక వేళ ఖర్చు పెరిగినా కూడా ప్రభుత్వం భోజనం పెట్టేందుకు వెనుకాడదని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.