హైదరాబాద్: హైదరాబాద్ నీటి కష్టాలను సీఎం కేసీఆర్ (CM KCR) తీర్చారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. గతంలో తాగునీటి కోసం దివంగత ఎమ్మెల్యే పీ. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు ధర్నాలు చేశారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు తెలంగాణలో లేవన్నారు. మహారాష్ట్రలో (Maharashtra) తొమ్మిది రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే ప్రాంతాలు కూడా ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లోనే కాదు.. పల్లెల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తున్నారని తెలిపారు. దీంతో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు కనిపించకుండా పోయాయన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో (KPHB Colony) 100 పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉంటే, ప్రస్తుతం అవి 70 శాతానికి చేరాయన్నారు. మనవద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదని, కష్టపడి పనిచేస్తేనే ఇదంతా సాధ్యమయిందని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏండ్లకు ఒక్క మెడికల్ కాలేజీ (Midical Colleges) పెట్టారని, కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణలో తొమ్మిదేండ్లలోనే 21 వైద్య కళాశాలలు ప్రారంభించుకున్నామని చెప్పారు. గతంలో వైద్యవిద్య కోసం ఉక్రెయిన్, చైనా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, దీంతో డాక్టర్ల కొరత అధికంగా ఉండేదన్నారు. నాడు ఎంబీబీఎస్ సీట్లు 2,950 ఉంటే నేడు 8,340 సీట్లు ఉన్నాయన్నాయని, ఇకపై
మన బిడ్డలు ఇక్కడే డాక్టర్లు కావొచ్చని స్పష్టం చేశారు.
మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఒక్కో మెడికల్ కాలేజీకి తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నదని వెల్లడించారు. కమలం పార్టీది జూటా ప్రచారమని, ఇంత దారుణం మరెక్కడా ఉండదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా లేదన్నారు.
వచ్చే నెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్ను అందించబోతున్నామని మంత్రి అన్నారు.
ఎవరూ అడగక ముందే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. తల్లి బలంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా బాగుంటుందని వెల్లడించారు. ఇది తల్లి, బిడ్డలకు సీఎం కేసీఆర్ అందిస్తున్న కానుక అని తెలిపారు. పుట్టుక నుంచి చావుదాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. బీజేపీ మంత్రులు ఢిల్లీలో అవార్డులు ఇస్తారని, గల్లీలో తిడుతున్నారని విమర్శించారు. దీనిపై
ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని, పని చేసేవారిని ఆశీర్వదించాలని కోరారు.