ఖమ్మం: టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. వైద్య ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. కేసీఆర్ కిట్ తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 52 శాతానికి పెరిగాయన్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతి జిల్లా కేంద్రానికి డయాలసిస్ కేంద్రం, ఐసీయూ వార్డులు తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు.
సింగిల్ ఫిల్టర్ను ఉపయోగించి డయాలసిస్ ఉచితంగా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. కల్యాణ లక్ష్మి పథకం కింద 10 లక్షల మందికి ఆర్థిక సహాయం అందించామని పేర్కొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అర్హులందరికి బూస్టర్ డోసు ఇస్తున్నామని చెప్పారు. సత్తుపల్లిలో 100 శాతం కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయ్యాయని చెప్పారు.
ఎమ్మెల్యే వెంకట వీరయ్య కోరగానే వంద పడకల దవాఖానను సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు. సత్తుపల్లిలో రూ.34 కోట్లతో 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నామని, రూ.1.25 లక్షలతో టీ డయాగ్నొస్టిక్ సెంటర్, రూ.1.78 కోట్లతో రేడియాలజీ ల్యాబ్ మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. పెనుబల్లి, కల్లూరు ప్రభుత్వ దవాఖానల నిర్మాణానికి సహకరిస్తామన్నారు. మధిరలో నిన్న వంద పడకల హాస్పిటల్కు శంకుస్థాపన చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వెంకట వీరయ్య పాల్గొన్నారు.