Minister Harish Rao | కామారెడ్డిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజీ ప్రారంభం కాబోతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్యరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలను వరకు తెలంగాణలో అన్ని రకాల సేవలు అందుతున్నాయన్నారు.
గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ డయాలసిస్ కేంద్రం కూడా ఉండేది కాదని, ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా పేషెంట్లకు ఉచిత బస్పాస్, పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వందకు 63శాతాం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని, కేసీఆర్ కిట్తో పాటు గర్భిణులకు కేసీఆర్ న్యూటిషన్ కిట్ను అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది కామారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభమవుతుందని, ఇప్పుడు వైద్యం కోసం హైదరాబాద్కు పోవాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజీ ప్రారంభంకాబోతుందన్నారు.
తెలంగాణలో గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లతో పేద గిరిజన విద్యార్థులకు వైద్య విద్య నేర్చుకునే అవకాశం దొరుకుతుందన్నారు. బీ కేటగిరి సీట్లలో లోకల్ రిజర్వేషన్ 80శాతం ఇవ్వడంతో స్థానిక విద్యార్థులకు వైద్య విద్య చదువుకునే అవకాశం దొరుకుతుందని చెప్పారు. దేశంలో తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో మూడో స్థానంలో ఉందని, మొదటి స్థానంలో ఉంచేందుకు అంతా కృషి చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి తీసుకువస్తున్నామన్నారు. ఎమ్మెల్యే సురేందర్ కృషి, పట్టుదలతో ఎల్లారెడ్డికి వంద పడకల ఆసుపత్రి మంజూరై శంకుస్థాపన చేసుకోగలిగామన్నారు. జూన్ 24 నుంచి పోడు భూములకు పట్టాలు అందించబోతున్నామని, పోడు భూములకు పట్టాలతో పాటు రైతుబంధు, రైతుబీమా సైతం ఇవ్వనున్నట్లు తెలిపారు.