హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఒక వ్యక్తి మరణించినా.. ఈ ప్రపంచంలో మరికొంత కాలం జీవించి ఉండే అవకాశం అవయవ దానం వల్ల మాత్రమే సాధ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు. 13వ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జీవన్ దాన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో అవయవదాతల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. దీనికి మంత్రులు మంత్రి హరీశ్రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ‘అయిన వారిని కోల్పోయామనే బాధలో ఉండి కూడా, మరొకరికి ప్రాణం పోయాలని ఆలోచించడం, అమలు చేయడం గొప్ప విషయం. మీ నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకం. బాధలో కూడా సామాజిక బాధ్యతను నిర్వర్తించిన మీ అందరికీ చేతులెత్తి మొకుతున్నాను. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల నేడు ఎంతో మంది పునర్జన్మ పొందారు’ అని పేర్కొన్నారు.
రియల్ హీరోస్గా నిలిచిన 105 కుటుంబాలను సన్మానించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్లు, డొనేషన్లలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. 2022లో తెలంగాణలో 194 మందిని బ్రెయిన్ డెడ్గా నిర్ధారించి, అవయవదానం చేశారని పేర్కొన్నారు. తమిళనాడులో 156, కర్ణాటకలో 151, గుజరాత్లో 148 అవయవదానాలు నమోదయ్యాయని చెప్పారు. అవయవ మార్పిడి చికిత్సల్లోనూ తెలంగాణ దేశంలోనే టాప్లో ఉన్నదని వెల్లడించారు. 2022లో దేశవ్యాప్తంగా 1,675 ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు జరగ్గా, ఇందులో తెలంగాణలోనే 530 ఉన్నాయని చెప్పారు. తమిళనాడులో 519, కర్ణాటకలో 415 సర్జరీలు జరిగాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే జాతీయ అవయవ దాన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అవార్డు అందిస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది, అవయవ దాతల కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు 126 ఆర్గాన్ డొనేషన్లు నమోదయ్యాయని చెప్పారు.
కార్పొరేట్కు దీటుగా నిమ్స్, గాంధీ, ఉస్మానియా
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్తనాళాలు.. ఇలా 8 రకాల అవయవాలు సేకరించవచ్చని మంత్రి వివరించారు. అవయవ మార్పిడి అనగానే ఒకప్పుడు కార్పొరేట్ దవాఖానలే గుర్తుకు వచ్చేవని మంత్రి అన్నారు. కానీ, సీఎం కేసీఆర్ కల్పించిన మౌలిక సదుపాయాల ఫలితంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రభుత్వ దవాఖానల్లోనూ అవయవ మార్పిడులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు నిమ్స్లో 395, ఉస్మానియాలో 74, గాంధీలో 11.. మొత్తంగా 480 ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు జరిగాయని తెలిపారు. ఇందులో అత్యధికంగా 436 కిడ్నీ మార్పిడులు ఉన్నాయని అన్నారు. గత నెలలో నిమ్స్లో ఒకేరోజు ఆరోగ్య శ్రీ కింద మూడు అవయవ మార్పిడి సర్జరీలు నిర్వహించారని గుర్తు చేశారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్పను, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ప్రభాకర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేశ్రెడ్డి, నిమ్స్, ఉస్మానియా సూపరింటెండెంట్లు బీరప్ప, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.