మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గత పాలకులు మహబూబ్నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీనైనా మంజూరు చేశారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ మూడు మెడికల్ కాలేజీలకు కలిపి రూ. 1500 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. ఇందులో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని హరీశ్రావు స్పష్టం చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో 30పడకల ప్రభుత్వ ఆసుపత్రిని హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో ఉపయోపడుతుందని ఈ ఆసుపత్రిని ప్రారంభించాం. డాక్టర్ లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి రూ. 2 కోట్ల 20 లక్షలతో 30 పడకల ఆసుపత్రిని నిర్మించారు. ఐదేళ్లు మంత్రిగా ఉండి చాలా బాగా పని చేశారు అని హరీశ్రావు కొనియాడారు.
కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరుకు వలసల జిల్లాగా పేరు ఉండే. ఇది వారిచ్చిన ఘనత అని పేర్కొన్నారు. బీజేపీ పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ హయంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కల్వకుర్తి నీళ్లు జడ్చర్ల దాకా తీసుకెళ్లాం. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాకు నీరు ఇ్వవగలిగాం. చెక్ డ్యాంలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేశాం. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి అని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.