మెదక్ : ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపల్ కేంద్రంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిహరీశ్ రావు అన్నారు. శుక్రవారం తూప్రాన్ మున్సిపాలిటీలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మిస్తున్నదని అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్లో దుమ్ము, ధూళి వంటివి ఆహార పదార్థాలపై పడకుండా నాలుగు ఫీట్ల ఎత్తున స్టాల్స్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
త్వరలో సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీనిచ్చారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, కోల్డ్ స్టోరేజీలు కూడ ఏర్పాటు చేశామని విక్రయ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
పాలు, పండ్లు, కూరగాయలు, మాంసం, చికెన్, చేపల విక్రయాలు ఈ మార్కెట్ పరిధిలోనే జరగాలన్నారు. బయట విక్రయించరాదని, ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. త్వరలో ఇక్కడ బ్యాంకు, ఏటీఏం సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. మార్కెట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన హితవు పలికారు.