సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని ప్రైవేట్ కాలేజీల్లో అగ్రికల్చర్ బీఎస్సీలో సీట్లు ఇప్పిస్తామంటూ నగరానికి చెందిన ఓ కన్సల్టెంట్ నిర్వాహకుడు మోసానికి పాల్పడ్డాడంటూ పలువురు బాధితులు సోమవారం సీపీ కార్యాలయం వద్దకు వచ్చారు. దీంతో సీపీ కార్యాలయం సిబ్బంది బాధితులను వెస్ట్జోన్ డీసీపీని కలువాలంటూ సూచించగా…వారు అక్కడకు వెళ్లారు.
యూసుఫ్గూడలో ఎంఎస్ అభినయ్ నాయక్ అనే వ్యక్తి కన్సల్టెన్సీని నిర్వహిస్తూ ఇతర రాష్ర్టాల్లో అగ్రికల్చర్ బీఎస్సీలో అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. దానిని చూసిన పలువురు విద్యార్థులు సీట్ల కోసం కన్సల్టెన్సీ నిర్వాహకులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, కొల్లాపూర్లోని డివై పాటిల్ కాలేజీ, పుణేలోని మరో కాలేజీలో అగ్రికల్చర్ బీఎస్సీలో సీట్లు ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేశాడని బాధితులు తెలిపారు.
మరికొందరి వద్ద రైల్వేలో ఉద్యోగాలిపిస్తానంటూ కూడా డబ్బులు వసూలు చేశాడని నిరుద్యోగులు ఆరోపించారు. తమ ఒరిజినల్ సర్టికేట్లను అతని వద్దనే పెట్టుకున్నాడని, కాలేజీలో సీట్లు ఇప్పించకపోవడంతో పాటు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని, తమ సర్టిఫికేట్లు తమకు ఇవ్వాలంటూ కోరినా పట్టించుకోవడంలేదు.. దీంతో ఈ నెల 16న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రశీదు ఇచ్చారని బాధితులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు ఇచ్చారని కన్సల్టెన్సీ నిర్వాహకుడు బెదిరింపులకు దిగుతున్నాడని.. అందుకే సీపీ వద్దకు వచ్చామని తెలిపారు. ఇదిలాఉండగా.. బాధితులు వెస్ట్జోన్ డీసీపీని కలిశారు.