సిద్దిపేట : ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు అన్నారు. సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్లో బస్తీ దవాఖాన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ లో భాగంగా పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
అందులో భాగంగా సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్లో గతంలో తాత్కాలిక భవనంలో బస్తీ దవాఖాన సేవలు అందుబాటులో ఉండేవి. రూ.18 లక్షలతో ఇటీవలే పక్కా భవనం నిర్మాణం చేపట్టామన్నారు. దీంతో ఇక్కడి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
బస్తీ దవాఖానాల్లో అవుట్పేషెంట్సేవలు అందించడం పాటు బీపీ, షుగర్తో సహా 57 రకాల వైద్య పరీక్షలను చేస్తారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తారని ఆయన పేర్కొన్నారు. స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించడంతో పాటు టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తారన్నారు.
ప్రభుత్వ వైద్య సేవల పై ప్రజల్లో అవగాహన కల్పంచాలి..
ప్రభుత్వ దవాఖాన వైద్య సేవల పై ప్రజల్లో అవగాహన కలిపించాలని, నార్మల్ డెలివరీలు జరిగేలా చూడాలని ఆశ, ఏఎన్ఎంలకు మంత్రి సూచించారు. ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానలోనే వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం పీహెచ్సీల వారీగా గత నెలలో డెలివరీల పై ఆరా తీశారు.