హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం నాణ్యమైన వైద్యానికి, ఉత్తమ వైద్యవిద్యకు హబ్గా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. టీచింగ్ దవాఖానల పనితీరుపై ఆయన మంగళవారం ఆన్లైన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వస్తే దేశంలో వైద్యవిద్యకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ అవుతుంది.
వైద్యవిద్య కోసం విదేశాలకు బదులు తెలంగాణకు వస్తారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యంతోపాటు, ఇకడి విద్యార్థులకు వైద్యవిద్య మరింత చేరువ అవుతుందన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం’ అని తెలిపారు. ఇందులో భాగంగా నిరుడు ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకొని రికార్డు సృష్టించామని గుర్తు చేశారు.
ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించనున్నామని చెప్పారు. ఒక్కో కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇప్పటికే మారుమూల జిల్లా కుమ్రంభీం ఆసిఫాబాద్తోపాటు, కామారెడ్డి, ఖమ్మం మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయని చెప్పారు. ఇందుకు కృషి చేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. మిగతా మెడికల్ కాలేజీల అనుమతులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. వాటికి పూర్తి అనుమతులు సాధించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ప్రతి ఒకరూ నూతనోత్సాహంతో పని చేయాలని, పేదలకు మంచి వైద్యసేవలు అందించాలని మంత్రి కోరారు. వైద్యరంగాన్ని పటిష్ఠం చేసేందుకు మెడికల్ కాలేజీలు, వైద్యుల పోస్టులు, వైద్య పరికరాలు.. ఇలా అడిగిన అన్నింటినీ సీఎం కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు. 65 మందికి కొత్తగా ప్రొఫెసర్ ప్రమోషన్స్ ఇచ్చామని చెప్పారు. 210 అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్లను త్వరలో ఇస్తామని, 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ త్వరలో పూర్తి అవుతుందని చెప్పారు. డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు ఉచితంగా మందులు ఇస్తామని తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యంలో మరో అడుగుపడింది. ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతిచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 9 జిల్లాల్లో కాలేజీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది. వీటిలో మూడు కాలేజీల ఏర్పాటుకు అనుమతులు రాగా, మిగతా ఆరింటికి రావాల్సి ఉంది.