Minister Harish Rao | ఇన్ఫ్లుయెంజా కేసులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా కేసుల పెరుగుదల నేపథ్యంలో బుధవారం వైద్యారోగ్యశాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో పరిస్థితులు, ఆరోగ్య శాఖ సన్నద్ధతపై సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్న ఇన్ఫ్లుయెంజా కేసుల గురించి అధికారులు మంత్రికి వివరించారు.
తెలంగాణలో ఇన్ఫ్లూయెంజా లక్షణాలతో బాధపడుతున్నవారి సంఖ్య స్వల్పంగా పెరిగాయన్నారు. ఎకువగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో దవాఖానలకు వస్తున్నారన్నారు. ఈ లక్షణాలతో వచ్చే చిన్న పిల్లల సంఖ్య కూడా పెరిగిందన్నారు. అయితే ఎవరికీ దవాఖానలో చేర్చి చికిత్స అందించేంత తీవ్ర లక్షణాలు లేవని స్పష్టం చేశారు. ప్రజలు ఎకువగా భయపడి అనవసరంగా యాంటీ బయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదన్నారు.
అవసరమైన వారికి వైద్యులు సూచిస్తారని, అప్పుడు మాత్రమే వినియోగించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఇన్ఫ్లుయెంజా కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటే సమీప ప్రభుత్వ దవాఖానకు వెళ్లి చికిత్స పొందాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడితే సరిపోతుందని చెప్పారు.
జ్వరం, జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ రాజారావు, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్, నిలోఫర్ సూపరింటెండెంట్ ఉషారాణి, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.