Maternity Leaves | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మహిళా ఉద్యోగుల మాదిరిగానే ఆశా కార్యకర్తలకు, సెకండ్ ఏఎన్ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో ఆశాలు, ఏఎన్ఎంలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఆశాల సేవలను సీఎం కేసీఆర్ గుర్తించి దేశంలోనే అత్యధిక వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. మంత్రి హరీశ్రావు సోమవారం ఆశాలు, ఏఎన్ఎంలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మూడు సార్లు వేతనాలు పెంచారని చెప్పారు. ప్రస్తుతం రూ.9,750 పారితోషికం ఇస్తున్నట్టు చెప్పారు. 14న నిర్వహించనున్న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవంలో ప్రతి ఒకరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. వైద్యారోగ్యశాఖలో సమిష్టి కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అభినందించారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమం విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీపీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.