జనగామ, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): చౌరస్తా.. లేకపోతే బహిరంగసభ.. లేకపోతే రోడ్షో.. లేకపోతే కార్నర్ మీటింగ్.. వేదిక ఏదైనా సరే. ఆ ఆరున్నర అడుగుల మనిషి.. నెమ్మదిగా ప్రసంగం మొదలుపెడతారు. ఆ ప్రసంగంలో ఛలోక్తులుంటాయి, సూటి విమర్శలు ఉంటాయి. అంతా ముచ్చట చెప్పినట్టే ఉంటుంది. జనం కూడా అదే తరహాలో మమేకం అవుతారు. అక్కడికి వచ్చినవాళ్లంతా ఆయన తనతోనే మాట్లాడుతున్నారన్నట్టు అనుభూతి చెందుతారు. అంతటి నేర్పరి బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్, ఆర్థిక మంత్రి హరీశ్రావు. తెలంగాణ ఉద్యమం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, దేశానికి దిక్చూచిగా ఉన్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తుంటే ప్రజలు చెవులు రిక్కించి వింటారు. అందరూ ఆయన ప్రసంగంతో కలిసిపోతారు.
తెలంగాణకు ఎవరి నాయకత్వం అవసరం అని జనాన్ని అడుగుతారు. తెలంగాణ తెచ్చిన కేసీఆరా? తెలంగాణ వాళ్లను సంపిన కాంగ్రెస్సా? 24 గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ కావాలా? మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ అవసరమా? కేంద్రం మెడ మీద కత్తి పెట్టినా మోటర్లకు మీటర్లు పెట్టని బీఆర్ఎస్ సర్కారా? రైతులతో 10 హెచ్పీ మోటర్లు కొనిపించాలనే హస్తం పార్టీనా? రైతుకు బంధువుగా ఉండే కేసీఆర్ సర్కారా? అని ప్రశ్నిస్తూ అందరినీ ఆలోచింపజేస్తారు. వారి నుంచే సమాధానాన్ని రాబడతారు. ప్రజలు కూడా తాము చూసింది, అనుభవించింది, లబ్ధి పొందుతున్నది చేతులెత్తి మరీ జవాబు చెప్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సభలు, రోడ్షోలు, సమ్మేళనాలతో తీరిక లేకుండా హరీశ్రావు ప్రచారం సాగుతున్నది. అయినా ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడుతారు.
ముఖ్యంగా బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వారితోనే చెప్పించటం హరీశ్రావు ప్రత్యేకత. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు మాట్లాడిన మాటలను గుర్తుచేస్తూ, ప్రజలముందే వారిని ఎండగడుతూ దూసుకుపోతున్నారు. శనివారం హరీశ్రావు పాల్గొన్న అన్ని సభలు కూడా ఇలాగే ఆసక్తికరంగా సాగాయి. రోజంతా బిజీగా గడిపినా ఎక్కడా అలసినట్టు కనిపించలేదు. మహబూబాబాద్, నర్సంపేట, పాలకుర్తి, జనగామ నియోజకవర్గాల్లో రోడ్షోలతో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సర్కారు సుపరిపాలనను, కాంగ్రెస్ పాలించిన పాత రోజులను గుర్తుచేసి ప్రజలతోనే చెప్పించారు. బీజేపీ సర్కారు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. రానున్న ఐదేండ్ల కార్యాచరణను వివరిస్తూ, ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్ర్తాలు సంధిస్తూ సూటిగా ప్రసంగం సాగింది. మూడోసారి కేసీఆర్ సీఎం అయ్యాక చేయబోయే పనులను చెప్పి ప్రజలకు భరోసా కల్పించారు.