హుజూరాబాద్ : హుజూరాబాద్ ( Huzurabad ) నియోజకవర్గం వీణవంక మండలంలోని మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసింది. ఈ మేరకు ఆ చెక్కులను మహిళా సంఘాలకు మంత్రి హరీశ్రావు అందించారు. స్వశక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 5 కోట్ల 37 లక్షలు మంజూరు చేశారు. స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ. 10 వేల కోట్లు, జీవనజ్యోతి మండలా సమాఖ్య(స్త్రీ నిధి)కు రూ. 4 కోట్లు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ అభివృద్ధికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా ఉంటామని మహిళలు ఉద్ఘాటించారు. చెక్కులను అందుకోవడం సంతోషంగా ఉందని మహిళలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మహిళా భవనాల కోసం రూ.4 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.