Minister Harish Rao | విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్ మాటకు దిరుగులేదని మంత్రి హరీశ్రావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. కందుకూరులో వైద్యకళాశాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి పాలనలో వివక్షకు గురైన ఈ ప్రాంతం, కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు.
అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఇక నుంచి మెడికల్ కళాశాల ద్వారా 450 పడకల ఆసుపత్రితో వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య మహేశ్వరం నియోజకవర్గానికి అందిస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 10వేల మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేసినవి 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని.. ఇందులో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ సొంత నిధులతో 36 మెడికల్ కాలేజీలను కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు.
రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ కేసీఆర్ నల్లా నీళ్లు తీసుకువచ్చారని చెప్పారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మార్చారన్నారు. విపక్షాల మాటలకు విలువ లేదు కేసీఆర్ మాటకు తిరుగులేదన్నారు. మళ్లీ బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అలాగే మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో కుల సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నూతనంగా నిర్మించనున్న 12 కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు. అన్ని సామాజిక వర్గాలు ఆత్మగౌరవంతో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు.