సిద్దిపేట: ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. చెట్లను పెంచడం ద్వారా ఆరోగ్య అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. చెట్ల పెంపకం ద్వారా 7.4 శాతం గ్రీన్కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సిద్దిపేటలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చెట్టు-బొట్టు పేరుతో చేపట్టిన ఇంటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణ కోసం దవాఖానలు కట్టడం కాదని, వ్యాధులు రాకుండా కాపాడుకోవడం అవసరమన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందిచాలని, వారి ఊపిరి తిత్తులను కాపాడాలని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు.
వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించి స్వచ్ఛమైన గోదావరి నీళ్లతో పండించిన పంట అందిచాలని మంత్రి చెప్పారు. హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం మొదలు పెట్టామని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది ప్రతిరోజూ ఉదయం వార్డులలో చెత్త ఏరడం ఒక మంచి పరిణామని వెల్లడించారు. తద్వారా ప్రజల్లో అవగాహన, చేతన కలుగుతుందన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని పెంచేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. జాతీయస్థాయిలో సిటిజన్ ఫీడ్బ్యాక్లో సిద్దిపేట రెండో స్థానంలో ఉందని చెప్పారు.