Minister Harish Rao | సిద్దిపేట, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటున్న కాంగ్రెస్ పార్టీని పాతర పెట్టాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు రైతులకు పిలుపునిచ్చారు. ఇందుకు ప్రతి రైతు ప్రతిజ్ఞ పూనాలని విజ్ఞప్తి చేశారు. 24 గంటల కరెంటుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ను పాతాళంలో పాత ర పెడితే మళ్లీ విత్తనం, మొలక కూడా లేవద్దని చెప్పారు. ‘మూడు గంటల కరెంటు అంటే పా తరేస్తం బిడ్డా’ అని ఊరూరా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ర్టాల్లో ఉచిత విద్యుత్తు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, వారి కడుపులో ఉన్న మాటలను బయట పెట్టారని ఎద్దేవా చేశారు. వారికి వ్యవసాయంపై అవగాహన లేదని మండిపడ్డారు. సోనియాగాంధీ ఉచిత కరెంటు ఇవ్వొద్దన్నారని ఒక నాయకు డు, ఎనిమిది గంటల కరెంటు చాలని మరొక రు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల పక్షపాతిగా ఉన్న సీఎం కేసీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉన్నదని చెప్పారు. కరువు అనే పదం తెలంగాణ డిక్షనరీలో లేకుండా చేసింది సీఎం కేసీఆరేనని పేర్కొన్నారు. నాడు పని కోసం ఇతర రాష్ర్టాలకు పోతే.. ఇవాళ పని కోసం ఇతర రాష్ర్టాల వారు మన తెలంగాణకు వచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వీటన్నింటిపై రైతులు చర్చ పెట్టాలని, కాంగ్రెస్ నాయకులు వస్తే పొలిమేర దాటే దాక తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
బీఅర్ఎస్ అంటే నిరంతర వెలుగులు
కాంగ్రెస్ని నమ్మితే మళ్లీ పాత రోజులు వస్తాయని హరీశ్రావు హెచ్చరించారు. కాంగ్రెస్ పాలన అంటే దొంగరాత్రి కరెంటు, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్తు షాక్లు, పాముకాట్లు అని వర్ణించారు. బీఆర్ఎస్ని నమ్మితేనే నిరంతర వెలుగులు కొనసాగుతాయని తెలిపారు. ఏ పార్టీ కావాలో రైతులు తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉచిత కరెంటు ఊరికే రాలేదని వివరించారు. ఒక్కో బోర్ పంపు మీద సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి రూ.25 వేలు రైతుల తరపున విద్యుత్తు శాఖకు చెల్లిస్తున్నదని వెల్లడించారు. బోర్ మీద రూ.25 వేలు, పెట్టుబడి సాయం కింద రూ.10 వేలు ఇస్తున్నారని తెలిపారు.
ఎరువులు, విత్తనాలు, గోడౌన్లు సమకూరుస్తున్నదని, పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నదని గుర్తుచేశారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేదా? అని ప్రశ్నించారు. ఏడాదికి ఉచిత విద్యుత్తు కింద రూ.12 వేల కోట్లు, రైతుబంధు కింద రూ.14,500 కోట్లు, పంటల కొనుగోళ్ల కోసం రూ.5 నుంచి 6 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని వివరించారు. రైతుబీమా కింద 1,06,478 మంది రైతుల కుటుంబాలకు రూ.5,323 కోట్ల బీమా సాయం అందజేసినట్టు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంతోనే రైతులకు భరోసా, ధైర్యం దొరికిందని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో దొంగరాత్రి కరెంటు
రైతులకు తొమ్మిది గంటల కరెంటు ఇస్తామంటూ గతంలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పదేండ్ల పాలనలో అమలు చేయలేదని హరీశ్రావు విమర్శించారు. అర్థరాత్రి ఇచ్చేవారని, గంటగంటకు ట్రిప్ అయ్యేదని, మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని గుర్తుచేశారు. ఆనాడు ఊరిలో మనిషి చనిపోతే స్నానం చేద్దామంటే కరెంటు లేని రోజులు ఉం డేవని ఆవేదన వ్యక్తంచేశారు. ఇవ్వాళ ఆ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. రైతులు ఎప్పుడంటే అప్పడు స్టాటర్ ఆన్ చేసుకుని, నీళ్లు పారించుకునే పరిస్థితులను సీఎం కేసీఆర్ కల్పించారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు మాత్రం మూడు గంటల కరెంటు ఇస్తే చాలని చెప్తున్నారని మండిపడ్డారు. మూడు గంటలు కరెంటు ఇస్తమన్న కాంగ్రెస్ నయ మా..? మూడు పంటలు పక్కాగా పండించే ధైర్యం ఇచ్చిన కేసీఆర్ కావాలా? ప్రతి రైతు ఆలోచన చేయాలని కోరారు.
కాళేశ్వరంపై మూర్ఖులు మాట్లాడుతున్నారు
కాళేశ్వరం ప్రాజెక్టు దండగ అని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. గాంధీభవన్లో, ఢిల్లీలో కూసుండి మాట్లాడుతున్నారని.. దండగ అని మాట్లాడే వారిని ఇక్కడికి తీసుకొచ్చి, ఆ నీళ్లలో ముంచితే దండగనా? పండగనా? తెలుస్తుందని ఎద్దేవా చేశారు. దండగ అంటే రైతులు వాళ్ల భరతం పడుతారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతోనే గోదావరి జలాలతో మండుటెండల్లో సైతం చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని, బంగారం లాంటి పంటలు పండుతున్నాయని తెలిపారు. ‘మూడు గంటలన్న కాంగ్రెస్ని బొంద పెట్టాలి. రైతులకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీని పాతర పెట్టాలి’ అని మంత్రి హరీశ్రావు అనగా.. రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
‘కాంగ్రెస్ పార్టీ వాళ్ల నోటికి మొక్కాలి. ఎనకట చంద్రబాబు కింద రేవంత్రెడ్డి పనిచేసిండు. ఆనాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నడు. ఎవుసం దండగ అంటే మనకు బువ్వ ఎవరు పెట్టాలి? నీ కడుపులకు అన్నం ఎవరు పెట్టాలి? వాళ్లకు గంత తెలివి ఉన్నది. ఆ చంద్రబాబు వారసుడే ఈ రేవంత్రెడ్డి.. ఆయన శిష్యరికంలో పెరిగాడు. ఆనాడు కరెంటు ఇవ్వలేదు. పెంచిన కరెంటు బిల్లులను తగ్గించమంటే బషీర్బాగ్లో కాల్చి చంపిండు చంద్రబాబు. అటువంటి నాయకునికి మూడు గంటల కరెంటు చాలని మాట్లాడిన నిజమైన వారసుడు అని రేవంత్రెడ్డి అనిపించుకున్నాడు. దీనిపై ప్రతి రైతు చర్చ పెట్టాలి. మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీని పాతర పెట్టాలి.’
-మంత్రి హరీశ్రావు
3 గంటల కరెంటుకు గుంట కూడా పారదు
కాంగ్రెసోళ్లకు సోయిలేకుండా మాట్లాడుతున్నరు. వాళ్లకు ఎవుసం గురించి తెల్వదు. మూడు గంటల కరెంటుకు ఎకరం పారిచ్చేటోళ్లను చూపిత్తరా? మా ఊరికి వస్తే కరెంటు వత్తుందా.. వత్తలేదా.. చూపిత్తం. ఫ్రీగా కరెంటు ఇచ్చే కేసీఆర్ను తిడుతుర్రు. రైతుబంధు ఇయ్యవట్టే.. రైతు సచ్చిపోతే ఐదు లచ్చలు ఇస్తుండు. ఏ గవర్నమెంట్ మా రైతులను పట్టించుకోలేదు. కేసీఆర్ వచ్చి పట్టించుకున్నడు. ఇసొంటి సీఎం కావాలి.
– గంగోళ్ల గణపురం బాలయ్య, రైతు, రాఘవాపూర్, సిద్దిపేట రూరల్